వారందరికి పవన్ ‘48 గంటల’ వార్నింగ్

వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం తలచుకొని ఒక నిర్ణయం తీసుకుంటే 48 గంటల్లో కిరాయి రౌడీ గ్యాంగులు ఉండవని హెచ్చరించారు. అలా చేస్తే కిరాయి గ్యాంగులు మెయింటైన్ చేసే వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడరని పరోక్షంగా వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం…కాంట్రాక్టర్లను జైల్లో పెడతాం అంటూ జగన్ చేసిన కామెంట్లకు పవన్ కౌంటర్ ఇచ్చారు.

ప్రభుత్వం తలచుకుంటే కరుడుగట్టిన నక్సలైట్ సంస్థలే కకావికలమయ్యాయని, ఈ రౌడీ మూకల ఆటకట్టించడం పెద్ద విషయం కాదని అన్నారు. ఇన్ని లక్షల మంది పోలీసులు, వందల మంది ఐపీఎస్ అధికారులు తలుచుకుంటే, కిరాయి రౌడీలపై ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అంటూ హెచ్చరించారు. ఆ పరిస్థితి తేవద్దని పవన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మకమైన విమర్శలు సహజమని, కానీ, గీత దాటి మాట్లాడతాం అంటే చేతిలో గీతలు మాయమయ్యేలా చేస్తామని పంచ్ డైలాగ్ కొట్టారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతుందంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ వారి బెదిరింపులకు భయపడలేదని గుర్తు చేశారు. అధికారం ఉన్నా.. లేకపోయినా.. పవన్ ఎప్పుడూ పవన్ లాగే ఉంటాడని అన్నారు. వైసీపీ రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ వంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని పవన్ వ్యాఖ్యానించారు.