పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల భ‌క్తుల‌పై తీవ్ర ప్ర‌భావం కూడా చూపించింది. వీటి విలువ 70 వేలు. అయితే.. ఈ కేసులో రాజీ చేసుకోవ‌డంతోపాటు.. ఫిర్యాదు చేసిన అప్ప‌టి టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది.. సీఐ.. స‌తీష్ కుమార్‌.. అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందారు.

మొత్తంగా ఈ కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. తాజాగా ఏపీ హైకోర్టు ఈ కేసుపై కీల‌క వ్యాఖ్యలు చేసింది. దీనిని కేవ‌లం దొంగ‌త‌నంగా చూడ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించింది. ఇది అతి పెద్ద నేర‌మ‌ని, కోట్ల మంది భ‌క్తుల విశ్వాసానికి, శ్రీవారి ఆల‌య న‌గ‌దు భ‌ద్ర‌త‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌ని పేర్కొంది. దీనిని తేలిక‌గా తీసుకుంటే.. భ‌క్తుల విశ్వాసానికి గండి కొట్టిన‌ట్టే అవుతుంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో నిందుతుల విష‌యాన్ని లైట్‌గా తీసుకునేందుకు కోర్టు సిద్ధంగా లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ కేసు విచార‌ణ‌ను నిష్ప‌క్షపాతంగా నిర్వ‌హించాల‌ని సీఐడీ అధికారుల‌కు కోర్టు స్ప‌ష్టం చేసింది. అదే సమ‌యంలో ప‌ర‌కామ‌ణి కానుక‌ల లెక్కిపు వ్య‌వ‌హారంపై ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న విధానాన్ని త‌మ‌కు చెప్పాల‌ని టీటీడీని ఆదేశించింది. అదేవిధంగా భ‌క్తుల‌కు కూడా ఈ విష‌యంలో అవ‌కాశం క‌ల్పించాల‌ని.. మ‌రింత ప‌క‌డ్బందీగా లెక్కింపు నిర్వ‌హించాల‌ని కూడా కోర్టు ఆదేశించింది. ప్ర‌తి విష‌యానికీ టీటీడీ బాధ్య‌త వ‌హించాల్సి  ఉంటుంద‌ని, కోట్ల మంది భ‌క్తుల మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని పేర్కొంది.

ముఖ్యంగా ఔట్ సోర్సింగ్‌(వేరే ఉద్యోగం చేసుకుంటూ.. పార్ట్‌టైమ్‌గా ప‌నిచేసేవారు) ఉద్యోగుల‌ను ఈ విధుల‌కు నియ‌మించే విష‌యంపై పున‌రాలోచ‌న చేయాల‌ని సూచించింది. అదేవిధంగా శ్రీవారిపై అచంచ‌ల భ‌క్తిని చాటుకునే వారికి కూడా ప‌ర‌కామ‌ణి కానుక‌ల లెక్కింపులో చోటు కల్పించాల‌ని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఏఐ వినియోగాన్ని పెంచాల‌ని సూచించింది.

ఇక కోర్టు వ్యాఖ్యలు చూసిన నెటిజన్లు మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలను మరోసారి తప్పుబడుతున్నారు. శ్రీవారి పవిత్ర సన్నిధిలో జరిగిన చోరీ చిన్నదైనా పెద్దదైనా అది ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించినట్టే అవుతుందని, ఈ విషయంలో కోర్టు కూడా జగన్ మరియు జగన్ ను వెంకేసుకొస్తున్న వైసీపీ నాయకులకు మొట్టికాయ వేసినట్టయిందని విశ్లేషకులు చెబుతున్నారు.