తెలంగాణలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు జోష్ చూపించారు. భారీ ఎత్తున పంచాయతీలను కైవసంచేసుకున్నారు. 193 మండలాల పరిధిలోని 3వేల, 911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు జరిగిన రెండో విడత పోలింగ్లో కాంగ్రెస్ మద్దతుతో రంగంలోకి దిగిన 1,728 మంది సర్పంచ్లు జయకేతనం ఎగురవేశారు. నిజానికి తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ హవాను చూసిన బీఆర్ఎస్ పార్టీ తన మద్దతు దారులకు బలమైన సంకేతాలు ఇచ్చింది. రెండో విడతలో అయినా.. పైచేయి సాధించాలని చెప్పింది.
కానీ, రెండో విడతలోనూ.. బీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులు వెనుకబడ్డారు. 3, 911 పంచాయతీల్లో కేవలం 912 సర్పంచు పదవులను మాత్రమే బీఆర్ఎస్ దక్కించుకుంది. తద్వారా.. బీఆర్ఎస్కు ప్రజల నుంచి భారీ మద్దతు లేదన్న విషయం స్పష్టమైంది. మరోవైపు.. బీజేపీ కూడా 201 స్థానాల్లో పైచేయి దక్కించుకుని అంతో ఇంతో అస్తిత్వం కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఆదివారం ఉదయం జరిగిన పోలింగ్లో పల్లె ప్రజలు భారీ ఎత్తున ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. మధ్యా హ్నం 1గంటకే పోలింగ్ సమయం ముగిసినా.. 2 గంటల వరకు కూడా క్యూలో ఉన్నవారు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దీంతో తొలి విడతతో పోల్చుకుంటే.. రెండో విడతకు పోలింగ్ శాతం పెరిగింది. దీంతో ఈ పెరిగిన ఓటు బ్యాంకు అంతా తమదేనని బీఆర్ఎస్ వర్గాలు భావించాయి. కానీ, ఎక్కడా ఆ దాఖలా పెద్దగా కనిపించలేదు. పోలింగ్ శాతం పెరిగిన పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకోవడం గమనార్హం. అదేవిధంగా పోలింగ్ శాతం నామమాత్రంగా జరిగిన చోట కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తంగా.. రెండో విడతలోనూ బీఆర్ఎస్కు అనుకూలంగా ఏమీ వాతావరణం కనిపించలేదు. మరోవైపు.. స్వతంత్రులుగా పోటీ చేసినవారు.. బీఆర్ఎస్ కలలను ఛిద్రం చేశారన్న లెక్కలు వస్తున్నాయి. వీరు 500 స్థానాల్లో విజయం దక్కించుకున్నారు.
తటస్థ ఓటు బ్యాంకును కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేక పోవడం.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత కూడా ఆ పార్టీపై సింపతీ పెరగకపోవడం వంటివి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీనికి ప్రధానంగా.. పార్టీపై విశ్వసనీయత సన్నిగిల్లు తోందన్న చర్చసాగుతోంది. చిత్రం ఏంటంటే.. బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఎన్నికలకు ముందు తిరిగిన పల్లెల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయడం గమనార్హం. జన జాగృతి పేరుతో కవిత.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్కు ముందు … వరంగల్, కరీంగనగర్, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించారు. ఇప్పుడు ఆయా జిల్లాల్లోని పల్లెల్లో కాంగ్రెస్ మద్దతు దారులు విజయం దక్కించుకున్నారు. సో.. మొత్తానికి కవిత దెబ్బ కూడా బీఆర్ ఎస్కు బాగానే తగిలిందన్న చర్చ సాగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates