నిన్నటిదాకా తిట్లు… కానీ ఇప్పుడేమో

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన లియోనెల్ మెస్సి రెండోసారి ఇండియాకు వస్తున్నాడని గత రెండు వారాలుగా ఇండియన్ మీడియా ఎంత హైప్ ఇస్తూ వచ్చిందో తెలిసిందే. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం మెస్సి.. కోల్‌కతా, కోచి, ముంబయి, ఢిల్లీ నగరాల్లో పర్యటించాలి. ఐతే కేరళలో ఏదో ఇబ్బంది తలెత్తి కోచి టూర్ క్యాన్సిల్ అయింది. అనుకోకుండా హైదరాబాద్ లిస్టులోకి వచ్చింది. 

ఐతే మెస్సిని ఇండియాకు రప్పించి మూడు రోజులు పర్యటించేలా చేయడంమంటే చిన్న విషయం కాదు. అందుకోసం వందల కోట్లు ఖర్చవుతుంది. ఐతే మెస్సికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ టూర్‌ను ఇండియాలో బాగానే మార్కెట్ చేసుకోగలమనే ఉద్దేశంతో ఆర్గనైజర్స్ ధైర్యంగా ముందడుగు వేశారు. హైదరాబాద్‌లో మెస్సి టూర్ కోసం దాదాపు రూ.100 కోట్ల దాకా ఖర్చయినట్లు వార్తలు వచ్చాయి. ఐతే టికెట్ సేల్స్‌, స్పాన్సర్‌షిప్ సహా అనేక మార్గాల్లో ఆదాయం రాబట్టుకునేలా ప్లాన్ చేసి తెలంగాణ ప్రభుత్వం ఈ పర్యటనకు ఓకే చెప్పింది.

ఐతే మెస్సి టూర్ కోసం ఇంత ఖర్చు పెట్టాలా.. దానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వాలా అంటూ తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెట్టి, యంత్రాంగాన్ని దాని మీద పని చేయించడం.. మెస్సితో కలిసి ఆడేందుకు స్వయంగా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయడం లాంటి పరిణామాలు చాలామందికి రుచించలేదు.

ఆయన మీద విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కానీ శనివారం ఈవెంట్ అయ్యాక నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయి రేవంత్ మీద ప్రశంసలు కురిపించాయి. కోల్‌కతాలో ఈవెంట్ ఫెయిలవడం రేవంత్‌కు వరంగా మారింది. దేశంలో ఫుట్‌బాల్‌కు అత్యంత ఆదరణ ఉన్న చోట.. ఆర్గనైజింగ్ సరిగా లేక ఈవెంట్ తుస్సుమనిపించింది. 

సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన విధ్వంసం తర్వాత అసలు మెస్సి టూర్ కొనసాగుతుందా అనే సందేహాలూ కలిగాయి. కానీ అదే రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు మెస్సి హైదరాబాద్‌ పక్కా ప్లానింగ్‌తో సక్సెస్ ఫుల్‌గా సాగడంతో తెలంగాణ సీఎం, నిర్వాహకుల మీద ప్రశంసల జల్లు కురిసింది. ఓవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వస్తున్న సమయంలోనే.. తెలంగాణ గవర్న‌మెంట్‌ను దేశమంతా కొనియాడింది. 

మెస్సికి ఏ రకమైన ఇబ్బందీ రాకుండా చూసుకోవడం.. భారీగా డబ్బులు పెట్టి స్టేడియానికి వచ్చిన అభిమానులకు పూర్తి సంతృప్తినిస్తూ మెస్సి  మూమెంట్స్‌ను ఎంజాయ్ చేసే అవకాశం ఇవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. సీఎం దగ్గరుండి ఎక్కడా చిన్న ఇబ్బంది రాకుండా చూసుకోవడంతో ప్లానింగ్ అంటే ఇదీ అంటూ ఆయనపై ప్రశంసలు కురిసింది. మెస్సి ఈవెంట్ ముందు సీఎంకు మైనస్ అవుతుందేమో అన్న సందేహాలు కలిగాయి కానీ.. చివరికి దీని ద్వారా ఆయన మంచి మైలేజే తెచ్చుకున్నారని చెప్పొచ్చు.