అధ్య‌క్షా.. అమాత్యులు మీరే.. వైసీపీలో గుస‌గుస‌!

అసెంబ్లీ స్పీక‌ర్, సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, మాజీ మంత్రి త‌మ్మినేని సీతారాం కు త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ ద‌క్కుతుంద‌ని వైసీపీలో గుస‌గుస వినిపిస్తోంది. ఆయ‌న ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటున్న మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు సీఎం జ‌గ‌న్ సానుకూలంగా ఉన్నార‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు. సీతారం దూకుడు, స్వామి భ‌క్తి, నియోజ‌క‌వ‌ర్గంలో అందుబాటులో ఉండ‌డం, ప్ర‌తిప‌క్షంపై వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా.. వ్యాఖ్య‌ల యుద్ధం చేయ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల్లోనూ సీతారాం.. ప్ర‌తిప‌క్షాన్ని వ‌రుస‌గా స‌స్పెండ్ చేయ‌డంతోపాటు.. అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి.

పైగా.. స‌భ‌లో మిగిలిన మంత్రులు, స‌భ్యులు సీఎం జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు. మంత్రి అనిల్‌.. జ‌గ‌న్‌ను దైవాంశ సంభూతిగా పేర్కొంటే.. పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ఏకంగా దేవుడితో పోల్చేసి ప్రశంస‌లు గుప్పించారు. దాదాపు ఐదు రోజుల అసెంబ్లీ భేటీలో ప్ర‌తి ఒక్క‌రూ సీఎంను ఏదో ఒక రూపంలో కొనియాడ‌డానికే త‌మ స‌మ‌యం వినియోగించారనేది క‌ళ్ల‌కు క‌ట్టిన వాస్త‌వం. అయితే.. చివ‌రి రోజు.. ఈ పొగ‌డ్త‌లు ప‌రాకాష్ట‌కు చేరాయి. ఏకంగా స్పీక‌ర్ స్థానంలో ఉన్న త‌మ్మినేని సీతారాం కూడా జ‌గ‌న్‌ను దేవుడు పంపించిన.. రాక్ష‌సుల‌ను(టీడీపీ) అంతం చేయ‌డానికి వ‌చ్చిన దైవ దూత‌గా.. అభివ‌ర్ణించి.. కీర్తించారు. దీంతో సీఎం స‌భ‌లోనే మురిసిపోయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఈ ప‌రిణామాల త‌ర్వాత‌.. సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు సీతారాం. ఈ స‌మ‌యంలోనే త‌న‌ కుమారుడు నాగ్‌ను ప‌రిచ‌యం చేయ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోర‌డం కూడా వార్త‌ల్లోకి ఎక్కాయి. అయితే.. సీతారాం మ‌న‌సులో కోరిక తెలిసిన జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విపై హామీ ఇచ్చార‌ని వైసీపీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. గుర్తింపు ఉన్న సీతారాం.. శ్రీకాకుళం రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి నాయ‌కులు, మంత్రులు ఉన్నా.. ఫైర్ బ్రాండ్ నేత‌లు క‌రువ‌య్యారు.

ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న స‌బ్జెక్టు వారీగా మాట్లాడ‌తారే త‌ప్ప‌.. ఫైర్ బ్రాండ్ కాదు. ఇక‌, డిప్యూటీ సీఎం కృష్ణ‌దాస్‌, మంత్రి అప్ప‌ల‌రాజులు కూడా దూకుడు రాజ‌కీయాల‌కు, కామెంట్ల‌కు క‌డు దూరం. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జిల్లాలో పార్టీ మరింత పుంజుకునేందుకు సీతారాం వంటి వారిని సంతృప్తి ప‌రిస్తే బాగుంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఖ‌చ్చితంగా సీతారాంకు ప‌ద‌వి ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.