బాబు కు అవకాశం ఉన్నా అహంకారం ఉండదు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ప‌లువురు కేంద్ర మంత్రులు కొనియాడారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల సంద‌ర్భంగా లోక్‌స‌భ వాయిదా ప‌డిన నేప‌థ్యంలో టీడీపీ ఎంపీలు కొంద‌రు కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం బాబు ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోవాల‌ని, రొయ్య‌ల మేత విష‌యంలో రైతుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ముగ్గురు కేంద్ర మంత్రుల‌కు వేర్వేరుగా లేఖ‌లు రాశారు. ఈ లేఖ‌ల‌ను ఆయా శాఖ‌ల మంత్రుల‌కు ఈ-మెయిల్ రూపంలో పంపించారు.

అదేవిధంగా లేఖ‌ల హార్డ్ కాపీల‌ను టీడీపీ ఎంపీలు స‌ద‌రు మంత్రుల‌ను క‌లిసి సోమ‌వారం మ‌రోసారి అందించారు. ఏపీలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వారు ప్ర‌స్తావించారు. కేంద్రం నుంచి త‌క్ష‌ణ సాయం ప్ర‌క‌టించాల‌ని సీఎం చంద్ర‌బాబు త‌ర‌ఫున కోరుతున్నామ‌ని వారు తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా కల్చర్, మత్స్య, పొగాకు రంగాల అభివృద్ధికి సహకారం అందించాల ని విన్న‌వించారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు బ్లూ ఎకానమీకి కేంద్రంగా ఉన్న ఏపీని అభివృద్ధి చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని విన్న‌వించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రులు సీఎం చంద్ర‌బాబును కొనియాడారు. కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉంటూనే.. ఎలాంటి డిమాండ్లు చేయ‌కుండా స‌మ‌స్య‌ల‌పై లేఖ‌లు రాయ‌డాన్నివారు స్వాగ‌తించారు. చంద్ర‌బాబు దూర‌దృష్టి అద్భుతం అంటూ ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్య‌ద‌ర్శి వ్యాఖ్యానించారు. అదేవిధంగా మ‌త్స్య‌శాఖ వ‌ర్గాలు కూడా ఇదే విష‌యాన్ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు లేఖ‌లు అందాయ‌ని.. వాటిని ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. త‌ప్ప‌కుండా సాయం అందేలా చూస్తామ‌ని వారు హామీ ఇచ్చిన‌ట్టు ఎంపీలు తెలిపారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నార‌ని వెల్ల‌డించారు.

గ‌తానికి భిన్నంగా..

ప్ర‌స్తుతం కేంద్రంలో ఏర్ప‌డిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీ బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఇస్తోంది. అదేవిధంగా బీహార్‌కు చెందిన జేడీయూ కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. వీరిద్ద‌రి మ‌ద్ద‌తుతోనే మోడీ స‌ర్కారు నిర్వి ఘ్నంగా మూడోసారి ప‌వ‌ర్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు కోరిన మేర‌కు కేంద్రం ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఆయ‌న చెప్పింది అంగీక‌రించాల్సి కూడా ఉంటుంది. అయితే.. బాబు గ‌త రెండు సంవ‌త్స‌రాల కాలంలో ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా.. కేంద్రంపై పెత్త‌నం చేసే ధోర‌ణిలో ఎప్పుడూ వ్య‌వ‌హ‌రించ‌లేదు. త‌న అవ‌స‌ర‌మే అయినా.. ఆయ‌న లేఖ‌ల‌తోనే విజ్ఞ‌ప్తులు పంపుతున్నారు. ఇదే విష‌యాన్ని తాజాగా కేంద్ర మంత్రులు ప్ర‌శంసించారు.