“ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!“ అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎవరికీ చెప్పినట్టు లేదు. ఒకవేళ చెప్పినా.. ఆయన బహిరంగ వ్యాఖ్యలు కూడా చేసింది లేదు. కానీ, తొలిసారి ఏపీలోని చంద్రబాబుతో కలిసిముందుకు సాగాలని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. దాదాపు 25 సంవత్సరాలకు పైగానే ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా అధికారంలో ఉన్న మోడీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం.. ఆదిశగా పార్టీనాయకులకు దిశానిర్దేశం చేయడం అంటే.. వ్యూహం లేకుండా ఉంటుందా? అనేది కీలక ప్రశ్న.
ప్రస్తుత పరిస్థితి ఏంటి?
భవిష్యత్తు కన్నా కూడా.. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. కేంద్రంలో మోడీ సర్కారు నిలబడేందుకు చంద్రబాబు మద్దతు అవసరం చాలా ఉంది. సో.. అందుకే ఆయన బీజేపీ నాయకులకు సూచనలు చేశారు.. అనే వారు ఉన్నారు. కానీ, దీనికి మించి.. మోడీ చాలానే ఆలోచన చేస్తున్నారు. కూటమి ధర్మాన్ని పాటించడం ద్వారా.. ఏపీలో పెరుగుతున్న వైసీపీ గ్యాప్ను తమకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా.. ప్రస్తుత రాజకీయాల్లో బలమైన శక్తిగా కూటమిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా.. కేంద్రాన్ని మరింత బలోపేతం చేయనున్నారు.
భవిష్యత్తు ఏంటి?
భవిష్యత్తు రాజకీయాలను పరిశీలిస్తే.. 2029 నాటికి.. కేంద్రంలో మరోసారి మోడీ వస్తారా? రారా? అనేది చెప్పడం ఇప్పుడు కష్టమే అయినా.. ప్రస్తుత కూటమి పార్టీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నది వాస్తవం. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవాలంటే.. ప్రస్తుతం ఉన్న కూటమిలో లుకలుకలు లేకుండా చేసుకోవాలి. ఈ దిశగానే మోడీ ఆలోచన చేస్తున్నారు. ఇది భవిష్యత్తులోనూ పార్టీకి మేలు చేస్తుందన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే ఆయన కీలక వ్యూహాన్ని ఏపీతో ప్రారంభించారన్నది జాతీయ మీడియా చెబుతున్న మాట.
మరీ ముఖ్యంగా ఉత్తరాదిన బీజేపీ కొంత వెనుకబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు పుంజుకుంటున్నాయి. అవి అధికారంలోకివస్తాయా? రావా? అనేది పక్కన పెడితే.. వచ్చే ఎన్నికల నాటికి సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలపై మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఇది గత ఎన్నికల్లో కలిసి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేయడం ద్వారా.. కేంద్రంలో మరోసారి(4వ సారి) అధికారం నిలబెట్టుకునే దిశగా మోడీ వ్యూహం వేశారన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates