రాజకీయాల్లో తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకునేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు నడవడం కీలకం!. ఇది కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అందరు నాయకులకు, పార్టీలకు కూడా వర్తించే సూత్రం. వైసీపీ ఇప్పుడు ఇదే బాట పడుతుందా? లేదా? అనేది చూడాలి. అయితే.. ఒక్కటి మాత్రం వాస్తవం.. తప్పులు చేశామని పార్టీ అధినేత జగన్ తొలిసారి అంగీకరించారని వార్తలొస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ప్రతి సారీ దబాయిస్తూ.. వచ్చిన ఆయన తాజాగా తొలిసారి తప్పు జరిగింది.. అని పార్టీ నేతలకు చెప్పారని సమాచారం.
వివిధ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను కోల్పోతున్న తరుణంలో జగన్ ఆయా అంశాలపై పార్టీ నేతలతో గురువారం అంతర్గత సమావేశం నిర్వహించారు. ఇది పూర్తిగా హాట్ డిబేట్గా నడిచిందని తెలిసింది. ఈ సమావేశానికి అత్యంత సన్నిహితులైన కొందరిని మాత్రమే పిలిచారు. అదేసమయంలో తాను రాసి పెట్టుకున్న అంశాలను కూడా జగన్ వారికి వివరించారు. ఈ సమయంలోనే గత ఎన్నికల్లో తప్పులు జరిగాయని జగన్ అంగీకరించారు.
“కొన్ని కొన్ని నాకు తెలియకుండా చేశారు. నేను కూడా అందరినీ నమ్మేశాను. ఇది తప్పు. కొందరిని మనం సమర్థవంతంగా పనిచేయించుకోలేకపోయాము. కొన్ని విషయాలను కొందరు నాదాకా తీసుకురాలేక పోయారు. తప్పులు జరిగిన తర్వాత కూడా కొందరు అంతా బాగుందని చెప్పారు. ఇది మనకు నష్టం తెచ్చింది.“ అని జగన్ వ్యాఖ్యానించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే.. ఎన్నికల్లో ఓటమిని మాత్రం ఇప్పటికీ జగన్ అంగీకరించలేక పోతున్నారని వారు చెబుతున్నారు.
కానీ.. తప్పులు జరిగాయని మాత్రం చెప్పుకొచ్చారు. బలమైన నాయకులను దూరం చేసుకున్నామన్న చర్చ కూడా పార్టీలో జరిగినట్టు తెలిపారు. కానీ.. వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు అవకాశం లేదని.. ఆ అవసరం కూడా లేదని జగన్ చెప్పినట్టు తెలిసింది. “వెళ్లిన వారిని వెనక్కి తీసుకురావడం లేదు. ఇప్పుడు కావాల్సింది.. చూడండి. మీకు స్వేచ్ఛ(ఫ్రీ హ్యాండ్) ఇచ్చాను. ఇక, మీ ఇష్టం“ అని వారితో చెప్పినట్టు సమాచారం. మొత్తానికి తప్పు అయితే జరిగిందని జగన్ ఒప్పుకోవడం గమనార్హం. అయితే.. భవిష్యత్తు ఏంటన్నది మాత్రం ఆయన ఇంకా తేల్చలేదని తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates