ఆ విషయంలో బాబు – పవన్ లను దాటేసిన మంత్రులు

చంద్రబాబు గవర్నమెంట్ లో అన్నింటికీ ఒక లెక్క ఉంటుంది… అది పక్కాగా ఉంటుంది. కేవలం నోటిమాటలు కాకుండా ప్రతిదానికి డేటా బేస్డ్ సమాచారంతో సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన సాగుతుంది అనేది ప్రజలు అధికారులలో ఉన్న నానుడి. అంకెలతో సహా ఆయన వివరిస్తుంటే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. నిన్నటి సమావేశంలో కూడా చంద్రబాబు మంత్రులు శాఖల వద్ద ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి డేటాను రిలీజ్ చేశారు. అందులో సీఎం సహా 25 మంది మంత్రుల పనితీరును అంచనా వేశారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఆయన అంకెలతో సహా వివరించారు.

పైళ్ల క్లియరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఆరో స్థానంలో ఉండటం, ఆ తర్వాత తొమ్మిదో స్థానంలో నారా లోకేష్, 11వ స్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండడం గమనార్హం. వీరి ముగ్గురిని కాదని ఐదుగురు మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ లో ముందున్నారు. డోలా బాల వీరాంజనేయ స్వామి ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఆయన ప్రజల సమస్యల ఫైళ్ళ ను పరిశీలించిన సగటు సమయం రెండు రోజుల 41 నిమిషాలు. మొత్తం 651 ఆయన క్లియర్ చేశారు. ఆ తర్వాత స్థానాల్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎన్ ఎస్ డి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, పొంగూరు నారాయణ ఉన్నారు . చివరి ఐదు స్థానాల్లో మంత్రులు కొలుసు పార్థసారధి, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల‌కు అన్ని సేవ‌లు ఆన్ లైన్‌లోనే అంద‌జేయాల‌న్నారు. ఇప్ప‌టికీ కొన్ని శాఖ‌లు భౌతికంగానే సేవ‌లందిస్తున్నాయ‌ని అలాంటి శాఖ‌లు వెంట‌నే త‌మ పంథా మార్చుకుని ప్ర‌జ‌ల‌కు ఆన్‌లైన్‌లో సేవ‌లందించేలా ఏర్పాట్లు చేసుకోవాల‌ని ముఖ్యమంత్రి అన్నారు. ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు తిర‌గ‌న‌వస‌రం లేకుండా మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా అంద‌జేస్తున్నామ‌ని, దీనిపై ప్ర‌జ‌ల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సీఎం చెప్పారు.