ఇంగ్లిష్ రాకపోతే ఏం… రాష్ట్రాన్ని నడిపించట్లేదా

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పాలన చేతకాదని, ఇంగ్లిషు మాట్లాడడం రాదని కొంతమంది అంటున్నారని చెప్పారు. అయితే, తాను గుంటూరులో చదువు కోలేదని, గూడు పుటాని తెలియదని అన్నారు. తనకు భాష గొప్పగా రాకపోవచ్చని, కానీ, ప్రజల మనసు తెలుసుకునే విద్య తనకు తెలుసని అన్నారు. ఆ మాటకొస్తే అగ్ర దేశాలైన చైనా, జర్మనీ, జపాన్ వాసులకు కూడా ఇంగ్లిషు రాదని చెప్పారు.

ఇంగ్లిషు మాట్లాడే అమెరికా కూడా చైనాపై ఆధారపడిందని, ఒక గంటసేపు చైనా సప్లైలు ఆపితే అమెరికా అల్లాడిపోతుందని అన్నారు. చైనాకు అమెరికా చాలా అప్పుపడిందని, కానీ, అక్కడ ఇంగ్లిషు మాట్లాడరని గుర్తు చేశారు. వర్సిటీలో చాలామంది విద్యార్థులు ఇంగ్లిషు రాదని బాధపడుతుంటారని, ఇంగ్లిష్ రాకపోవడం పెద్ద విషయం కాదని చెప్పారు. తాను రెండేళ్లుగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నానని, కావాలంటే ఇంగ్లిషులో మాట్లాడేవాళ్లని 10 మందిని పెట్టుకొని మాట్లాడమని చెబుతానని అన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని అనుకున్నానని చెప్పారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. యూనివర్సిటీకి వచ్చేందుకు కావాల్సింది ధైర్యం కాదని, వర్సిటీపై అభిమానం అని చెప్పారు. అధికారులు తనకు పేపర్లు ఇచ్చి అదే మాట్లాడమని చెప్పారని, కానీ, తన మనసులో ఏముంటే అది మాట్లాడతానని, పేపర్ చూసి మాట్లాడనని చెప్పానని తెలిపారు. ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాలన్నదే తన సంకల్పం అని చెప్పారు.