ఫ్యూచర్ సిటీలో సినీ స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిర్మాతలు ఎవరైనా.. ఎక్కడి నుంచైనా ఎవరు వచ్చినా.. స్క్రిప్టుతో వస్తే చాలు.. ఇక్కడ సినిమాలు రూపొందించుకుని తీసుకుని వెళ్లే సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా సినీఇండస్ట్రీ ప్రముఖులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. తెలుగు ఇండస్ట్రీతోపోటు బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
తెలంగాణ అభివృద్ధిలో సినీ రంగానికి కూడా కీలక పాత్ర ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి.. 24 ఫ్రేమ్స్లో ప్రతి కళనూ ప్రోత్సహిస్తామన్నారు. అయితే.. స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ఆయన సూచించారు. అదేవిధంగా సినీ రంగంలో కళాకారులను ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ రైజింగ్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీఎం ఆకాంక్షించారు. వచ్చే 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించనున్నట్టు తెలిపా రు.
“తెలంగాణ అభివృద్దిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరితోనూ కలిసి ముందుకు సాగుతాం. సినీ రంగానికి కూడా ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించనున్నాం. స్టూడియోలు నిర్మించండి. భూములు, నీరు, విద్యుత్ వంటి విషయాల్లో రాయితీలు ఇస్తాం.“ అని రేవంత్ రెడ్డి చెప్పారు. కాగా.. రెండో రోజు సమావేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలతోపాటు మేధావులు, విద్యావంతులు కూడా పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం తెలంగాణ రూపు రేఖలను మరింత మారుస్తుందని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates