అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్ల‌మెంటులోని హోం శాఖ కార్యాల‌యంలో రాష్ట్ర మంత్రి అనిత‌, పార్టీ పార్ల‌మెంట‌రీ నాయ‌కుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు తో క‌లిసి లోకేష్‌.. కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి అన్ని విధాలా స‌హ‌క‌రిస్తున్న కేంద్రానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ముఖ్యంగా విశాఖ‌ప‌ట్నానికి గూగుల్ డేటా కేంద్రం రాక‌వెనుక కేంద్రం ఇచ్చిన స‌హ‌కారానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌పై అమిత్‌షాతో చ‌ర్చించారు. దీనిలో భాగంగా గ‌త నెల‌లో సంభ‌వించిన మొంథా తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో జ‌రిగిన న‌ష్టం తాలూకు వివ‌రాల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. ఈ తుఫాను కార‌ణంగా రాష్ట్రానికి 6,352 కోట్ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింద‌ని వివ‌రించారు. ముఖ్యంగా ప‌లు జిల్లాల్లో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని.. వారిని ఆదుకునేందుకు త‌క్ష‌ణ సాయం ప్ర‌క‌టించాల‌ని కోరారు. కేంద్రం నుంచినిపుణుల బృందం ఇప్ప‌టికే వ‌చ్చి ప‌రిశీలించింద‌ని.. నివేదిక కూడా ఇచ్చింద‌ని తెలిపారు.

ప్ర‌ధానంగా రైతుల‌తో పాటు.. 3 వేల‌కుపైగా గ్రామాల్లో ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని.. వారికి ప్రాథ‌మిక సాయం కింద ప్ర‌భుత్వం కొంత మొత్తం అంద‌జేసింద‌ని.. పున‌రావాస కేంద్రాల్లోని కుటుంబాల‌కు రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయంతోపాటు.. నిత్యావ‌స‌ర వ‌స్తువులను కూడా అందించిన‌ట్టు వివ‌రించారు. అలానే.. నివాసాలు కోల్పోయిన వారికి టిడ్కో కింద ఇళ్ల‌ను మంజూరు చేస్తున్నామ‌న్నారు. ఇక‌, తుఫానుల కార‌ణంగా కురిసిన భారీ వ‌ర్షాల‌తో ర‌హ‌దారులు దెబ్బ‌తిన్నాయ‌ని.. వాటి నిర్మాణానికి 600 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేసిన‌ట్టు వివ‌రించారు.

విద్యుత్ రంగం నుంచి తాగునీటి స‌ర‌ఫ‌రా వ‌ర‌కు 500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్లిందని వివ‌రించారు. కేంద్ర పున‌రావాస చ‌ట్టంలోని నిబంధ‌న‌ల మేర‌కు త‌మ‌కు త‌క్ష‌ణ అవ‌స‌రంగా నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రికి నారా లోకేష్ విన్న‌వించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం నిధులు ఇవ్వాల‌ని కోరారు. ఇప్ప‌టికిప్పుడు 900 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. రాష్ట్రంలో కూట‌మిప్ర‌భుత్వం చేస్తున్న ప‌నులు, కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి వివ‌రించారు.