ఏపీలో ఫిల్మ్ టూరిజం… కూటమి మాస్టర్ ప్లాన్

ఏపీలో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. దేశంలోనే సినిమా షూటింగ్‌ లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఏపీని నిలిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామని చెబుతోంది. విశాఖపట్నం, భీమునిపట్నం మరియు కాకినాడ వంటి స్వచ్ఛమైన బీచ్‌ల నుండి గోదావరి మరియు కృష్ణ నదుల సుందరమైన తీరాలు ఇక్కడ ఉన్నాయి.

తిరుపతి, శ్రీశైలం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. ఆంధ్రా కాశ్మీర్గా పిలువబడే అరకు లోయ, లంబసింగి వంటి చల్లని హిల్ స్టేషన్లకు ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివచ్చి ఆస్వాదిస్తుంటారు. సినిమా షూటింగ్‌లకు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. భారతదేశ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే అవసరమైన ప్రోత్సాహం, భరోసా కల్పిస్తామని, కలిసి పనిచేద్దామని ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
 
పర్యాటకులకు  ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో సినిమాటోగ్రఫీ, చారిత్రక వారసత్వాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సుందరమైన లొకేషన్లు, పరిశ్రమ ప్రతిభ, గ్లోబల్ హిట్స్ తమ వద్ద ఉన్నాయని, ఫిల్మ్ టూరిజంలో విస్తృతమైన అవకాశాలున్నట్లు తెలుపుతూ సినిమా రంగంలో  ప్రపంచ స్థాయి స్టూడియోలు, డబ్బింగ్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలు తదితర మౌలిక వసతులు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు.

కొత్త ఫిల్మ్ పాలసీ ఈ క్లిష్టమైన మౌలిక సదుపాయాల కల్పనకు రివార్డు ఇచ్చేలా ప్రత్యేకంగా రూపొందించబడిందని, స్టూడియోలు, సపోర్ట్ సర్వీసులలో పెట్టే పెట్టుబడులకు పోటీతత్వ ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. అదే విధంగా కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాకుండా నిజమైన ‘నాలెడ్జ్ ఎకానమీ’ని నిర్మించడానికి, గ్లోబల్ థింకర్స్ మరియు ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాము ఉత్సాహంగా పనిచేస్తున్నామన్నారు.

ఈ క్రమంలో మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ రంగంలో అధిక-విలువైన మేధో సంపత్తిని ఆకర్షించి తమ సృజనాత్మక అవుట్‌పుట్ ప్రపంచ స్థాయిలో పోటీపడేలా, దక్షిణ భారతీయ కంటెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే గేట్‌వేగా ఉండాలని భావిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ వేదికగా వెల్లడించారు.