కార్యకర్తలను పట్టించుకోకపోతే.. ?

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు అగ్రస్థానం ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మన సందర్భాల్లో గుర్తు చేస్తుంటారు. నిన్నటి పార్టీ నేతల టెలికాన్ఫరెన్స్లో ఆయన ఆ విషయాన్ని పునరుద్ఘాటించారు. కార్యకర్తలను పట్టించుకోకుండా, ప్రజల్లో ఉండకపోతే మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండబోదని తేల్చి చెప్పారు. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కూటమి ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు.

నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నేతలుగా రాణించగలరు.. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే చేయించి సమాచారం తెప్పించుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. కార్యకర్తల మనోభీష్టం మేరకే నాయకులు నడుచుకోవాలని సూచించారు.

ప్రతి నెల ఒకటో తేదీన జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమం పై కూడా ఆయన దిశా నిర్దేశం చేశారు. పింఛన్ల పంపిణీ కూడా.. పేదల సేవ కిందకే వస్తుందనీ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. పింఛన్ల పంపిణీలో నేతల భాగస్వామ్యం పెరగాలని చంద్రబాబు కోరారు.

నేతలు నిరంతరం ప్రజలతోనే ఉండాలనీ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. డిసెంబర్ 3న రైతుసేవా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలు, 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.. ఇలా ప్రతి కార్యక్రమంలో పార్టీ నాయకత్వం, కార్యకర్తలు పాల్గొనాలి” అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.