రెండు మాసాల తర్వాతే కొత్త పాలకవర్గం

ఎంతో ఉత్కంఠ రేకెత్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఎన్నికల ఫలితాల్లో గెలిచిన వారు మరో రెండుమాసాల పాటు వెయిట్ చేయాల్సిందేనా ? అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. ఎందుకంటే గ్రేటర్ పాలకవర్గానికి ఇపుడున్న పాలకవర్గానికి మరో రెండు నెలలు కాలపరిమితి ఉంది. అంటే ఇపుడున్న మేయర్, డిప్యుటి మేయర్, కార్పొరేటర్లే ఫిబ్రవరి 10వ తేదీ వరకు కంటిన్యు అవ్వచ్చు. ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి కాబట్టి ఇప్పటికిప్పుడు అర్జంటుగా ప్రస్తుత పాలకవర్గం అధికారంలో నుండి దిగిపోవాల్సిన అవసరం లేదు.

తాజాగా వెల్లడైన ఫలితాలతో టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటి రాలేదన్నది వాస్తవం. సింగిల్ లార్జెస్టు పార్టీగా, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల మద్దతుతో గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుత పాలకవర్గానికి 2016లో ఎన్నికలు జరిగినపుడు టీఆర్ఎస్ 99 డివిజన్లలో గెలిచింది. మరిపుడు 56 డివిజన్లలో మాత్రమే గెలిచింది. అంటే 43 డివిజన్లను కోల్పోయిన విషయం స్పష్టమైంది. అప్పట్లో గెలిచిన డివిజన్ల కారణంగా ఎక్స్ అఫీషియో ఓట్లతో సంబంధం లేకుండానే మేయర్, డిప్యుటి మేయర్ స్ధానాలను ఏకపక్షంగా గెలుచుకున్నది.

కానీ ఇప్పటి పరిస్ధితి దానికి భిన్నంగా ఉంది. ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్ల సహకారం లేకుండా మేయర్ ను గెలుచుకునే పరిస్దితి లేదు. అయితే వెలుపల నుండి ఎంఐఎం మద్దతిస్తే మేయర్ ను టీఆర్ఎస్ గెలవచ్చు. అలాగే మేయర్ ఎన్నిక సమయంలో ఓటింగ్ నుండి ఎంఐఎం గైర్హాజరైనా కూడా టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి.

ఏదేమైనా, పద్దతి ఏదైనా మేయర్, డిప్యుటి మేయర్ పదవులైతే టీఆర్ఎస్ గెలుచుకునేందుకే అవకాశాలున్నాయన్నది స్పష్టం. ఇప్పటికిప్పుడు తమ వ్యూహాలను వెల్లడించాల్సిన అవసరం లేదు కాబట్టి రెండు నెలల్లోగా వర్కువుట్ చేసుకోవచ్చు. అసలు పాలకవర్గం కాలపరిమితి పూర్తవ్వటానికి ఇంకా రెండు నెలలు గడువుండగా ఎన్నికలు నిర్వహించటమే టీఆర్ఎస్ చేసిన తప్పుగా అధికారపార్టీ నేతలంటున్నారు.

దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచిన వేడి తగ్గకుండానే గ్రేటర్ ఎన్నికలు వచ్చేయటం కమలంపార్టీకి బాగా కలిసొచ్చిన అంశంగా చెప్పుకుంటున్నారు. అదే మరో రెండు నెలల తర్వాతే గ్రేటర్ ఎన్నికలు జరిగుంటే జనాల్లో వరదాగ్రహం చల్లారేది, బీజేపీ నేతల్లో దుబ్బాక ఊపు తగ్గుండేదని కారుపార్టీ నేతలు ఇపుడు చెప్పుకోవటమంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా అనిపించటం లేదు ?