తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పుచ్చు వంకాయ, సచ్చు వంకాయ అంటూ కవితపై ఆయన విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే నిరంజన్ రెడ్డికి కవిత డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే..పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చె లేచిపోద్ది చెబుతున్నా…అని కవిత వార్నింగ్ ఇచ్చారు. సిన్సియర్ గా సీరియస్ గా ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఎందుకు భయం అని నిరంజన్ రెడ్డిని ప్రశ్నించారు.
వ్యవసాయ శాఖా మంత్రిగా అవకాశమిస్తే పనిచేయాల్సింది పోయి ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు. ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి మూడు ఫామ్హౌస్లు ఎలా కట్టుకున్నారని ఏకీపారేశారు. అసైన్డ్ భూములను ఆక్రమిస్తు, కృష్ణా నది కాలువ సైతం ఆయన ఫామ్హౌస్ నుంచే వెళ్లేలా మళ్లించుకున్నారని ఆరోపించారు. నిరంజన్ రెడ్డి తన తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాదిచ్చి మాట్లాడానని, ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
ఆఖరికి దేవుడి మాన్యాలు కూడా కొట్టేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. వనపర్తి మార్కెట్, గద్వాల భూములు అన్నీ ఆయనకే కావాలని, ఆయన భూ, ధన దాహానికి అంతు లేదని విమర్శించారు. నిరంజన్ రెడ్డి వ్యవహారాలు కేసీఆర్ కు తెలియవని తాను అనుకుంటున్నానని, ఇటువంటి నాయకుడిని ఏ పార్టీ కూడా ఉపేక్షించకూడదని అన్నారు. ఇలా కరప్షన్ ను ఎంకరేజ్ చేసుకుంటూ పోతే తెలంగాణ బాగుపడదని అన్నారు. స్వర్గంలో ఉన్న ఆయన మామ సిగ్గుపడుతుంటారని నిరంజన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు తాను పర్యటనలు చేస్తుంటే వాటిని నిరంజన్ రెడ్డి విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డి గురించి తాను మాట్లాడలేదని, అయినా తనపై విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయనపై తాను చేసిన వ్యాఖ్యలకు రిటార్ట్ ఇస్తే బాగుండదని కూడా నిరంజన్ రెడ్డిని హెచ్చరించారు. ఇకపై ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. మరి, కవిత కామెంట్లపై నిరంజన్ రెడ్డి సైలెంట్ గా ఉంటారా స్పందిస్తారా అన్నది వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates