రాజకీయాల్లో లెక్కలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని ఫార్ములాలు కొందరికి మినహాయింపులు ఇచ్చేసే పరిస్థితి కాలం ఇస్తూ ఉంటుంది. బీజేపీ లాంటి పార్టీ.. తాను గురి పెట్టిన రాష్ట్రంలో తన భాగస్వామి పార్టీ కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించి కూడా ముఖ్యమంత్రి కుర్చీని మిత్రపక్షానికి కట్టబెట్టటమే ఒక వింత. అందుకు వేదికగా మారింది బిహార్. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బంపర్ మెజార్టీతో విజయం సాధించటం తెలిసిందే.
అందరి అంచనాలకు భిన్నంగా మరోసారి బిహార్ ముఖ్యమంత్రి పదవిని నితీశ్ కుమార్ కు కట్టబెడుతూ మోడీషాలు ఓకే చేశారు. ఇందుకు బదులుగా నితీశ్ కు ఎంతో ఇష్టమైన.. గడిచిన ఇరవై ఏళ్లుగా తన వద్దే ఉంచుకునే పవర్ ఫుల్ హోంశాఖను బీజేపీకి ఇచ్చేసిన వైనం చూస్తే.. తనకు ముఖ్యమంత్రి కుర్చీని కట్టబెట్టిన మోడీషాలకు ఎక్సెప్రెస్ వేగంతో నితీశ్ బదులు తీర్చేశారని చెప్పాలి.
అత్యంత కీలకమైన హోంశాఖను బీజేపీ సీనియర్ నేత.. డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న సామ్రాట్ చౌధరికి కేటాయించారు. మరో డిప్యూటీ సీఎం కం బీజేపీ నేత విజయ్కుమార్ సిన్హాకు రెవెన్యూ.. భూసంస్కరణలు.. భూగర్భ గనుల శాఖను అప్పగించారు. ముఖ్యమంత్రి నితీశ్ మాత్రం తన వద్ద సాధారణ పరిపాలన విభాగం.. క్యాబినెట్ సెక్రటేరియట్.. విజిలెన్స్ తదితర శాఖల్ని ఉంచుకున్నారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. జేడీయూతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ ఆర్థికశాఖను తన వద్దే ఉంచుకునే బీజేపీ.. ఈసారి అందుకు బదులుగా జేడీయూకు కట్టబెట్టటం ఆసక్తికరంగా మారింది.
జేడీయూ అధినేతగా ఉన్న నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటమే కాదు.. మిత్రులను ఎదగకుండా చూసుకునే బీజేపీ లాంటి పార్టీని..మోడీషాలను ఒప్పించి ముఖ్యమంత్రి కావటం.. శాఖల కేటాయింపు విషయంలో తూకాన్ని పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తోంది. మొత్తంగా నితీశ్ మామూలోడు కాదని మాత్రం చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates