తమ్మినేని Vs చంద్రబాబు.. సరిపోయింది

ఒకసారి అసెంబ్లీ స్పీకర్ స్ధానంలో కూర్చున్న తర్వాత సదరు నేత అసెంబ్లీలోని అన్నీ పార్టీలకు సమాన వ్యక్తిగా మారిపోతారు. ఈ సంప్రదాయం ఎప్పుడో ఉండేది కానీ ఇపుడు టార్చిలైట్ వేసినా ఎక్కడా కనబడటం లేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విదానం చూస్తుంటే ఆ విషయం అర్ధమైపోతోంది. మరీ గడచిన మూడు రోజులుగా సభలో జరుగుతున్న వ్యవహారాలు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. మూడు రోజుల సమావేశాల్లో చర్చలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు మాట్లాడింది పక్కకు పోయి కేవలం తమ్మినేని వర్సెస్ చంద్రబాబు గొడవలే బాగా హైలైట్ అయ్యాయి.

నిజానికి స్పీకర్ ను వేలెత్తి ఏ సభ్యుడు కూడా చూపకూడదన్న విషయం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అలాటే స్పీకర్ స్ధానంలో కూర్చున్న వ్యక్తి ఏ సభ్యుడిని కూడా ఏకవచనంతో సంబోధించకూడదు. కానీ ఏవైతే జరగకూడదని అనుకుంటున్నారో అవన్నీ జరిగిపోతున్నాయి. నిజానికి సభలో పార్టీల సభ్యుల సంఖ్యాబలం ఆధారంగానే మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు స్పీకర్. ఈ పద్దతి దశాబ్దాల నుండి నడుస్తున్నదే. కానీ నిబంధనలను చంద్రబాబు పట్టించుకోవటం లేదు.

సభలో తమకున్న బలం ఆధారంగా కేటాయించే సమయానికి మించి కావాలంటే పదే పదే పట్టుబడుతున్నారు. పైగా టీడీపీ తరపున ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళని కాదని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటు గోల చేయటమే విచిత్రంగా ఉంది. పంటల నష్టంపై టీడీపీ సభ్యుడు రామానాయుడు మాట్లాడుతున్న సమయంలోనే మైక్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సభలో అందరికీ మార్గదర్శిగా ఉండాల్సిన వ్యక్తే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సాకుగా తీసుకుని అధికార వైసీపీ సభ్యులు కూడా చంద్రబాబును టార్గెట్ చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

ఇక్కడ సమస్య ఏమిటంటే స్పీకర్ గా ఉన్న తమ్మినేనికి, చంద్రబాబుకు ఒకరంటే మరొకొరికి ఏమాత్రం పడదు. పాత కక్షలను మనసులో పెట్టుకున్న ఇద్దరు కూడా ఒకరిపట్ల మరొకరు చాలా అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ను పట్టుకుని చంద్రబాబు నువ్వెంతంటే నువ్వెంతంటున్నారు. దాంతో స్పీకర్ కూడా చంద్రబాబుపై రెచ్చిపోయి అరిచేస్తున్నారు. తమ్మినేని టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబుతో సన్నిహితంగానే ఉండేవారు.

కానీ తర్వాత కింజరాపు ఎర్రన్నాయుడు కారణంగానే తమ్మినేనిని చంద్రబాబు దూరం పెట్టేశారని పార్టీలో ప్రచారంలో ఉంది. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోవటం, టీడీపీకి రాజీనామా చేయటం తర్వాత వైసీపీలో చేరటం అందరికీ తెలిసిందే. తమ్మినేని స్పీకర్ స్ధానంలో కూర్చోవటంతో ఇష్టం లేకపోయినా ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాల్సొస్తోంది. ఎప్పుడైతే ఇద్దరు ఎదురుపడుతున్నారో పాత గొడవలన్నీ గుర్తుకొస్తున్నట్లున్నాయి. అందుకే ఒకరి విషయంలో మరొకరు అంత పరుషంగా మాట్లాడుకుంటున్నారు.