విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో రూ. 4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు కుదిరాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి. శనివారం మంత్రి సవిత సమక్షంలో ఈ ఒప్పందాలు పూర్తయ్యాయి. టెక్నికల్ టెక్స్ టైల్స్, రీసైక్లింగ్, గార్మెంట్స్, సిల్క్, అప్పారెల్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు.
విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కామధేను సటికా సంస్థ రూ. 90 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమతో 650 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ. 120 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ వల్ల 250 మందికి ఉపాధి లభించనుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ. 20 కోట్లు పెట్టనుంది. దీంతో రెండు వేల ఉద్యోగాలు రానున్నాయి.
గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 35 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థతో గుంటూరులో రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ. 105.38 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. ఈ సంస్థ ఏర్పాటుతో 900 మందికి ఉపాధి లభిస్తుంది.
అనకాపల్లిలో బీసీయూబీఈ టెక్స్ టైల్స్ సంస్థ రూ. 10 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ యూనిట్ వందమందికి ఉద్యోగాలు కల్పించనుంది.
ఇక ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఏపీలో రూ. 4 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ఈ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్ విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. టెక్స్ టైల్స్ రీసైక్లింగ్ టెక్నాలజీని భారత్ కు తొలిసారి తీసుకురావడం ఇదే.
మొత్తం ఏడు ఒప్పందాల ద్వారా టెక్స్ టైల్స్ రంగంలో ఏపీకి రూ. 4,380.38 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పరిశ్రమలతో మొత్తం 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates