కేటీఆర్‌ను అరెస్టు చేద్దామంటే.. : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేద్దామంటే గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి ఇవ్వ‌డంలేద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేవిధంగా అవినీతి మ‌య‌మైన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై సీబీఐ వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుని.. దీనిని సీబీఐకి కూడా అప్ప‌గించామ‌న్నారు. కానీ, మూడు మాసాలైనా ఇప్ప‌టి వ‌ర‌కు సీబీఐ రంగంలోకి దిగ‌లేద‌ని తెలిపారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తే.. బీఆర్ఎస్‌ను బీజేపీ కాపాడుతోంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని ఆరోపించారు. బీజేపీ, కారు పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం-సంబంధం లేక‌పోతే.. ఇలా ఎందుకు జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు.

త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంద‌ని మ‌రోసంచ‌ల‌న వ్యాఖ్య చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విష‌యాన్ని గ‌తంలో అదే పార్టీకి చెందిన క‌విత కూడా చెప్పార‌న్నారు. విలీన ప్ర‌క్రియ ప్ర‌తిపాద‌న‌ను తానే అడ్డుకున్న‌ట్టు ఆమె చెప్పిన విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స‌మ‌యంలో ఇరు పార్టీలు క‌లిసి.. ప్ర‌యోగం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసినా.. జూబ్లీహిల్స్‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనేన‌ని సీఎం చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తున్న ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు అండ‌గా ఉంటున్నార‌ని తెలిపారు.

మైనారిటీలు, క్రిస్టియ‌న్ వ‌ర్గాలు కూడా త‌మ‌కే అనుకూలంగా ఉన్నార‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన రాహుల్ గాంధీ మైనారిటీల‌కు అండ‌గా ఉన్నార‌ని తెలిపారు. వారంతా కాంగ్రెస్‌తోనే ఉన్నార‌ని పేర్కొన్నారు. అదేవిధంగా క్రిస్టియ‌న్లు కూడా త‌మ‌తోనే ఉన్నార‌ని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో వారి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని హామీ ఇచ్చిన‌ట్టు తెలిపారు. బీఆర్ ఎస్‌-బీజేపీలు ఆడుతున్న నాట‌కాల‌ను.. క‌ల‌సి చేస్తున్న విన్యాసాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్న రేవంత్ రెడ్డి..త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పోలింగ్‌లో ఇరు పార్టీల‌కు బుద్ది చెబుతార‌ని అన్నారు.

కిష‌న్ రెడ్డి మ‌రోమాట‌..

మ‌రోవైపు బీజేపీ నాయ‌కుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు క‌వ‌ల పిల్ల‌ల‌ని.. అవి రెండూ క‌లిసే ప‌నిచేస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. బీజేపీకి-బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నా రు. పైగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న‌ప్పుడు.. కేసీఆర్ మంత్రిగా ప‌నిచేశార‌ని.. తెలంగాణ వ‌చ్చాక కుటుంబంతో స‌హా క‌లిసి వెళ్లి సోనియాగాంధీని ప్ర‌శంసించార‌ని గుర్తు చేశారు. కాబ‌ట్టి.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్యే అవ‌గాహ‌నా ఒప్పందం ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.