దుబ్బాక రిజల్టును వార్నింగ్ క్రింద తీసుకున్న జగన్

తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నిక ఫలితాన్ని జగన్మోహన్ రెడ్డికి ఓ వార్నింగ్ లాగ తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణాలోని దుబ్బాకకు, ఏపిలోని తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు దగ్గరి పోలికలున్నాయి. దుబ్బాకలో ఎంఎల్ఏ సోలిపేట రామలింగారెడ్డి కరోనా వైరస్ కారణంగా మరణించారు. తిరుపతి వైసీపీ ఎంఎల్ఏ బల్లి దుర్గాప్రసాదరావు కూడా కరోనాతోనే మరణించారు. దుబ్బాకలో సోలిపేట 67 వేల భారీ మెజారిటితో ఎంఎల్ఏగా గెలిచారు. తిరుపతిలో బల్లి కూడా 2.28 లక్షల మెజారిటితో గెలిచారు.

సీన్ కట్ చేస్తే దుబ్బాకలో ఉపఎన్నికను కేసీయార్ కానీ లేకపోతే అధికార పార్టీ నేతలు మొదట్లో చాలా లైటుగా తీసుకున్నారు. దీని ఫలితంగానే ఫలితాలు కేసీయార్ కు షాక్ ఇచ్చింది. నిజానికి ఉపఎన్నికలో గెలిచేంత సీన్ బీజేపీకి లేదు. కానీ కేసీయార్ నిర్లక్ష్యానికి తోడు ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత, ప్రత్యర్ధిపార్టీల్లోని కొన్ని బీజేపీకి సైలెంటుగా సహకరించటం లాంటి కారణాల వల్ల కమలం అభ్యర్ధి రఘునందనరావు గెలిచారు. కేసీయార్ పాలనపై జనాల్లో వ్యతిరేకత ఉన్నా ఉపఎన్నికలో గెలవటానికి టీఆర్ఎస్ కు అనేక అవకాశాలున్నాయి. అయినా కేవలం నిర్లక్ష్యం వల్లే అన్నింటినీ చెడగొట్టుకున్నది.

సరిగ్గా ఈ ఫలితాన్నే జగన్ వార్నింగ్ లాగ తీసుకున్నట్లు నేతలు చెబుతున్నారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపికపై మంత్రులు, ఎంఎల్ఏలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఎదురైన చేదు అనుభవాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. కేసీయార్ పై తెలంగాణాలో వ్యతిరేకత పెరుగుతున్నట్లు ఏపిలో జగన్ పై వ్యతిరేకత లేనప్పటికీ ముందు జాగ్రత్త పడాలని జగన్ కచ్చితంగా వార్నింగ్ ఇచ్చారు.

నిజానికి ప్రతిపక్షంలో ఉన్నపుడే వైసీపీ అభ్యర్ధికి 2.28 లక్షల భారీ మెజారిటి వచ్చినపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే ఉపఎన్నికలో అంతకుమించి మెజారిటి రావాలన్నది జగన్ భావన. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో జనాల్లో బాగా సానుకూలత కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఏ పార్టీ కూడా తమ అభ్యర్ధి కచ్చితంగా గెలుస్తాడనే నమ్మకాన్ని జనాల్లో కలిగించలేకపోతున్నాయి.

సంక్షేమ పథకాల్లో స్పీడుగా దూసుకుపోతున్న నేపధ్యంలో జరగబోతున్న ఉపఎన్నికలో ఏడాదిన్నర పాలనపై జనాలు తీర్పివ్వబోతున్న విషయంపై జగన్ కు బాగా క్లారిటి ఉంది. అందుకనే ప్రతిపక్షాలకు అసలు డిపాజిట్టే రాకుండా చూడాలనే టార్గెట్ పెట్టుకున్నారట. తన పాలనపై జనాల్లో ఎటువంటి సానుకూలత ఉంది అనే విషయంలో తిరుపతి ఉపఎన్నికను గీటురాయిగా చాటి చెప్పాలని జగన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట మంత్రులు, ఎంఎల్ఏలకు. మరి చివరకు ఎటువంటి ఫలితం వస్తుందో చూడాల్సిందే.