టీడీపీలో చ‌ర్చ‌: బెజ‌వాడ మేయ‌ర్ పీఠం ఎవ‌రికి?

బెజ‌వాడ టీడీపీ నేత‌ల మ‌ధ్య ఓ ఆసక్తిక‌ర విష‌యం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. స్థానిక ఎన్నిక‌ల‌కు ముహూర్తం ఫిక్స‌యితే.. ఆ జాబితాలో విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కూడా ఉంటాయి. ఈ క్ర‌మంలో మేయ‌ర్ పీఠం ఎవ‌రికి? అనే ప్ర‌శ్న.. మ‌రోసారి తెరమీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి ఇప్ప‌టికే కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత‌కు కేటా‌యించారు. దీంతో ఇప్ప‌టికే కేశినేని కుటుంబం మేయ‌ర్ అభ్య‌ర్థిగా శ్వేత కూడా ప్ర‌చారానికి దిగారు. అయితే..అనూహ్యంగా ఎన్నిక‌లు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇటీవ‌ల కాలంలో పార్టీకి కేశినేని నాని దూరంగా ఉంటున్నారు. విజ‌య‌వాడ ఎంపీగా త‌న‌కు పార్టీలో ప్రాధాన్యం దక్క‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, ఈ విష‌యాన్ని నేరుగా చెప్ప‌కుండా ఆయ‌న స్వ‌ప‌క్షంలోనే విప‌క్షంగా మారి విమ‌ర్శ‌ల‌కు దిగారు. పైగా.. క‌మ్మ సామాజిక వ‌ర్గంపైనే ఆయ‌న విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. ఈ ప‌రిణామంతో విజ‌య‌వాడ న‌గ‌రంలోని క‌మ్మ వ‌ర్గం స‌హా.. విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ కూడా నాయ‌కులు కూడా కేశినేనికి దూరంగా ఉంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా.. మేయ‌ర్ అభ్య‌ర్థిని మార్చాల‌నే డిమాండ్ తెర‌మీద‌కి వ‌చ్చింది.

ఇటీవ‌ల న‌లుగురు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన విజ‌య‌వాడ నాయ‌కులు.. భేటీ అయి.. మేయర్ అభ్య‌ర్థి విష‌యంలో చంద్ర‌బాబు పున‌రాలోచించాల‌ని.. అంద‌రినీ క‌లుపుకొని పోయే నాయ‌కురాలికి కేటాయించాల‌ని కొత్త డిమాండ్‌ను తెర‌మీదికి తెచ్చారు. మేయ‌ర్ అభ్య‌ర్థిగా మాజీ జెడ్పీ చైర్ ప‌ర్స‌న్‌.. గ‌ద్దె అనురాధ‌ వైపు వీరు మొగ్గుతున్నారు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ స‌తీమ‌ణి.. అనురాధ‌.. అయితే.. బాగుంటుంద‌నేది వీరి అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వ‌చ్చిన సూచ‌న‌. అయితే.. నేర‌గా ఈ విష‌యాన్ని చెప్ప‌కుండా.. అభ్య‌ర్థిని మార్చాలంటూ.. చంద్ర‌బాబు లేఖ రాసిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌గా మారింది. మ‌రి బాబు ఏం చేస్తారు? ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన శ్వేత అభ్య‌ర్థిత్వాన్ని వెన‌క్కి తీసుకుంటారా? లేక ఆమెనే కొన‌సాగిస్తారా? అనేది చూడాలి.