చంద్ర‌బాబు ఇచ్చిన రాయితీలు త‌ప్పుకాదు!: కేంద్ర మంత్రి

ఏపీలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అలివిమీరిన హామీలు ఇస్తోంద‌ని.. అందుకే త‌మ‌కు రావాల్సిన సంస్థ‌లు కూడా ఏపీకి వెళ్లిపోతున్నాయ‌ని క‌ర్ణాట‌క మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే చేసిన వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ స్పందించారు. బెంగ‌ళూరుతో విశాఖ‌కు పోలిక అవ‌స‌రం లేద‌న్నారు. బెంగ‌ళూరు ఇప్ప‌టికే అభివృద్ది చెందిన న‌గ‌ర మని.. దీనిని ఇత‌ర న‌గ‌రాల‌తో పోల్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. అనేక మౌలిక స‌దుపాయాలు.. ఏర్పాట్లు కూడా బెంగ‌ళూరులో ఉన్నాయ‌ని చంద్ర‌శేఖ‌ర్ వ్యాఖ్యానించారు.

కానీ, ఏపీలో అలాంటి అవ‌కాశాలు ఇప్పుడిప్పుడే ఏర్ప‌డుతున్నాయ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఏపీ వంటి రాష్ట్రాలు నిల‌దొక్కుకు నేందుకు కొంత మేర‌కు పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణలో రాయితీలు ప్ర‌క‌టించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. దీనిని త‌ప్పుబ‌ట్టాల్సిన అవ స‌రం లేద‌న్నారు. సీఎంగా చంద్ర‌బాబు పెట్టుబ‌డుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఈ నేప‌థ్యంలో ప‌లు సంస్థ‌లు ఆయా పెట్టుబ‌డుల నేప‌థ్యంలో కొన్ని రాయితీలు కోర‌డం స‌హ‌జ‌మేన‌ని తెలిపారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పెట్టుబ‌డుల క‌ల్ప‌న‌కు రాష్ట్రాల మ‌ధ్య పోటీ నెల‌కొన్న మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు.

మ‌రిన్ని రాయితీలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వాలు ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రాల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఎప్పుడూ మంచిదేన‌ని తెలిపారు. విశాఖకు బెంగ‌ళూరుకు పోలిక లేద‌ని.. అందుకే విశాఖ‌లో ఏర్పాట‌య్యే సంస్థ‌ల‌కు కొద్దిగా రాయితీల‌ను ఎక్కువ‌గా ఇస్తున్నార‌ని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ప్ర‌తి రాష్ట్రం అభివృద్ధి చెందాల‌నేదే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంక‌ల్ప‌మ‌ని చెప్పారు. అప్పుడే 2047నాటికి విక‌సిత్ భార‌త్ సాకారం అవుతుంద‌న్నారు. దీనిలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ప్ర‌స్తుతం ఆదాయార్జ‌న‌కు దూరంగా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను ఆదాయ బాట ప‌ట్టించ‌నున్న‌ట్టు కేంద్ర మంత్రి చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. దీనిలో బీఎస్ఎన్ఎల్‌, పోస్ట‌ల్ వంటివి ప్ర‌ధానంగా ఉన్నాయ‌ని తెలిపారు. వీటిని కూడా త్వ‌ర‌లోనే ఆదాయం వ‌చ్చే సంస్థ‌లుగా మార్పులు చేసేందుకు రూ.5 వేల కోట్ల‌ను కేటాయించ‌నున్న‌ట్టు చెప్పారు. అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ ద్వారా భార‌త్ నెట్ వ్య‌వ‌స్థ‌ను దేశంలోని ప్ర‌తి మారుమూల గ్రామానికీ చేరువ చేయ‌నున్న‌ట్టు మంత్రి వివ‌రించారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు క‌నెక్టివిటీ పెరుగుతుంద‌ని చెప్పారు.