ఆ మంత్రుల‌పై సీఎం డిజ‌ప్పాయింట్.. నిజ‌మెంత ..!

కొంతమంది మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు క్యాబినెట్ సమావేశం జరిగినా పలువురు మంత్రులను ఆయన హెచ్చరిస్తున్నారు. పనితీరు మార్చుకోవాలని, ప్రజలతో కలివిడిగా ఉండాలని, నాయకులతో కలిసి పనిచేయాలని కూడా ఆయన సూచిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులను ప్రత్యేకంగా తన చాంబర్ కు పిలిపించుకున్న ముఖ్యమంత్రి వారికి క్లాస్ ఇచ్చార‌ని తెలిసింది.

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రస్తుతం టిడిపి తరఫున మంత్రులుగా ఉన్న వారిలో వంగలపూడి అనిత, అచ్చం నాయుడు ముందు వరుసలో ఉన్నారు. వీరిద్దరూ సంస్థగతంగా టిడిపిలోనే కొనసాగుతున్నారు. రాజకీయాలు ప్రారంభించింది కూడా ఈ పార్టీలోనే కావడం గమనార్హం. అయితే.. ఎందుకు సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు.. అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఉత్తరాంధ్ర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో పలు పరిశ్రమలను తీసుకువస్తున్నారు.

అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా పెట్టుబడులను కూడా తీసుకొస్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వీటిని తీసుకువెళ్ల లేకపోతున్నారన్నది సీఎం చంద్రబాబు చెప్పిన మాట. ఉదాహరణకు విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేస్తున్నారు. దీని ప్రమోషన్ మాత్రం పెద్దగా లేదన్నది చంద్రబాబు చెబుతున్న మాట. అలాగే విశాఖపట్నంకి లులు కంపెనీ సహా ఐటీ, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయి.

ఈ విషయంలోనూ మంత్రులు ఉదాసీనంగా ఉన్నారన్నది చంద్ర‌బాబు మాట. ఇక గడిచిన 15 మాసాల కాలంలో విశాఖపట్నం నుంచే దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు చెప్తున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో మంత్రులు ఉదాసీనంగా ఉన్నారన్నది ఆయన విమర్శ. ప్రధానంగా పెట్టుబడుల కల్పనతో పాటు ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, అదే విధంగా మూతపడకుండా కాపాడుకున్నామని అని చెప్తున్నారు.

ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ల లేక పోయారు అన్నది ఆయన అసంతృప్తికి ప్రధాన కారణం. అలాగే విశాఖలో రైల్వే జోన్ స‌హా ప‌లు సంస్థల రాక‌, గూగుల్ డేటా సెంటర్ వంటివి వస్తున్నప్పటికీ ప్రజల్లో అనుకున్న విధంగా అనుకున్నంత స్థాయిలో ప్రచారం కల్పించలేకపోవడం, ప్రజల్లో చర్చ పెట్టకుండా వ్యవహరించడం వంటివి ఉత్తరాంధ్ర మంత్రులపై చంద్రబాబులో అసంతృప్తిని నింపింది అన్నది వాస్తవం. ఇదే విషయాన్ని ఆయన తాజాగా ప్రస్తావించి ఇట్లాగే ఉంటే కష్టమని హెచ్చరించారు. మరి ఇప్పటికైనా మంత్రులు మారతారా ప్రజల్లోకి వెళ్తారా లేదా అనేది చూడాలి.