వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఉన్న మంత్రి సురేఖ భర్త కొండా మురళి.. మరోసారి తెరమీదికి వచ్చారు. గతంలో ఇదే జిల్లాకు చెందిన కడియం శ్రీహరిపై విమర్శలు, ప్రతి విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మురళి.. అధిష్టానం ముందు వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై నిప్పులు చెరిగారు. “పొంగులేటి మాపై పెత్తనం చేస్తాడా? అంత.. మొగోడా?!“ అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సురేఖ దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే.. ఆమె శాఖ వ్యవహారాలను పొంగులేటి ఆదేశిస్తున్నారన్నది మురళి ప్రధాన ఆరోపణ. గత నెలలో మేడారం జాతర జరిగినప్పుడు.. తర్వాత కూడా.. ఆయన ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారని చెప్పారు. మేడారంలో కాంట్రక్టు పనులను తన కంపెనీలకే ఇచ్చుకున్నారని ఆరోపించారు. భద్రాచలం ఆలయానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ ఆయన తలదూర్చుతున్నారని పేర్కొన్నారు.
అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుని.. సురేఖ శాఖలో వేలు పెడుతున్నారని కొండా మురళి ఆరోపించారు. దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ఇది మరోసారి రిపీట్ అయితే.. ఏమాత్రం సహించేది లేదన్నారు. పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు సహా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ కు కూడా తాను ఫిర్యాదు చేశానని.. వారి నుంచి సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
“ఒకళ్ల శాఖలో ఒకరు వేలు పెట్టడం ఏంటి? ఎందుకు..? నీకు అంతగా ఇష్టమైతే.. ఆ శాఖనే తీసుకోవచ్చు కదా. సురేఖమ్మ శాఖలోనీకేం పని. అన్ని పనులు నీకే కావాల. అన్నీ నీకేవాలా? మిగిలిన వారు ఏం చేస్తారు? ఇందుకేనా మంత్రి పదవి ఇచ్చింది?“ అని కొండా మురళి వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఇలాంటి కార్యక్రమాలను ఉపేక్షించేది లేదన్నారు. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు పేఏర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates