కేసీయార్ ముందు షాకింగ్ రిపోర్టులు ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల తీరు కేసీయార్ కు షాక్ తప్పేలా లేదని సమాచారం. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న విధానంపై సర్వే చేయించుకున్న సీఎంకు అందిన రిపోర్టు ప్రకారం పెద్ద షాక్ తగటం ఖాయమని ప్రచారం పెరిగిపోతోంది. అందరికన్నా ముందే అభ్యర్ధులను సెట్ చేసుకుని ఒక్కసారిగా గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేట్లుగా అధికారపార్టీ వ్యూహం రచించింది. అయితే రోజులు గడిచేకొద్దీ వ్యూహం రివర్సవుతున్నట్లు కేసీయార్ కు స్పష్టంగా తెలిసిపోతందట.

ఇంతకీ విషయం ఏమిటంటే 150 డివిజన్లలో సెంచిరీ దాటాలని కేసీయార్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే సెంచిరీ కాదుకదా కనీసం అందులో సగం డివిజన్లలో అభ్యర్ధులు గెలిచినా చాలా ఎక్కువే అన్నట్లుగా ఉందట క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు. అభ్యర్ధులను ముందుగానే డిసైడ్ చేయటం, ఇన్చార్జులను నియమించటం, మంత్రులు, ఎంఎల్ఏలతో ప్రచారం చేయించటం, గెలుపు బాధ్యతలు కేటీయార్ కు అప్పగించటం లాంటివి ఎంత పక్కగా చేసినా లాభం లేకపోయిందని కేసీయార్ కు అర్ధమైందట.

చాలా డివిజన్లలో పోటీలో ఉన్న అభ్యర్ధులకు ఎంఎల్ఏలకు పడటంలేదట. అందుకనే కొందరు ఎంఎల్ఏలు తమ అభ్యర్ధుల గెలుపుకు ఏమాత్రం పనిచేయటం లేదట. పైగా అభ్యర్ధుల మీద కోపంతో ఇతరుల గెలుపు కోసం కృషి చేస్తున్నారట. కొన్ని డివిజన్లలో మంత్రులకు-ఎంఎల్ఏలకు-అభ్యర్ధులకు మధ్య సమన్వయం ఉండటం లేదట. దాంతో విషయం ఏమిటో తెలుసుకుందామని కేసీయార్ సర్వే చేయించినట్లు సమాచారం.

మూడు రోజుల పాటు ప్రత్యేకంగా ఓ బృందం డివిజిన్లలో తిరిగి ఇచ్చిన సర్వే రిపోర్టులో షాకింగ్ వివరాలు బయటపడ్డాయట. అంతర్గతంగా పెరుగుతున్న వివాదాలు, సమన్వయ లేమి కారణంగా కనీసం 30 డివిజన్లలో గెలుపు కష్టమని బయటపడిందట. ఒక వైపు ప్రత్యర్ధులు పుంజుకుంటుంటే అధికారపార్టీ అభ్యర్ధులు మాత్రం అంతర్గత గొడవలతోనే కాలం గడిపేస్తున్నారంటూ నివేదికలో స్పష్టంగా బయపడిందని సమాచారం.

సీఎంకు అందించిన రిపోర్టు కాబట్టే 30 డివిజన్లలో కష్టమని చెప్పారని వాస్తవానికి అంతకన్నా ఎక్కువ డివిజన్లలోనే టీఆర్ఎస్ నష్టపోవటం ఖాయమని క్షేత్రస్ధాయి సమాచారం. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికలు కేసీయార్ కు డేంజర్ బెల్స్ మోగించటం ఖాయమనే అనిపిస్తోంది.