ప్ల‌స్‌‌ల‌న్నీ వైసీపీ ఖాతాలోకి.. మైన‌స్‌ల‌న్నీ బీజేపీ ఖాతాలోకి..

రాజ‌కీయాల్లో వ్యూహాల‌కు కొద‌వ ఉండ‌దు. ఎక్క‌డ ఎలాంటి వ్యూహం వేస్తే.. త‌మ‌కు ఇబ్బంది ఉండ‌దో గుర్తించి మ‌రీ.. నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్న ప‌రిస్థితి నేటి రాజ‌కీయాల్లో మెండుగా ఉంది. ఇప్పుడు ఇలాంటి వ్యూహాల‌నే అధికార పార్టీ వైసీపీ కూడా అనుస‌రిస్తోంది. ప్ర‌జ‌ల‌కు అనుకూలమైన నిర్ణ‌యాలు ఉంటే.. వాట‌న్నింటినీ.. త‌న ఖాతాలో వేసుకోవ‌డం.. లేదంటే మాత్రం.. ఆయా నిర్ణ‌యాలు, ప‌థ‌కాల‌నుకూడా కేంద్రంలోని బీజేపీ ఖాతాలోకి నెట్టేస్తున్న విష‌యం ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

సాధార‌ణంగా.. ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మైనా.. త‌న సొంత‌గా అమలు చేసే కొన్ని కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు ఉంటాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం కూడా కొన్ని ప‌థ‌కాల‌ను నిర్దిష్టంగా అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌ పై ఒత్తిడి తెస్తుంది. ఇలాంటివి కొన్ని ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌న‌కరంగా ఉండొచ్చు.. లేదా ఒకింత ఇబ్బంది క‌లిగించేవి ఉండొచ్చు. ప‌థ‌కాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. అమ‌లు చేయాల‌నే కేంద్రం రాష్ట్రాల‌ను కోరుతుంది. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలోనూ ఇలానే కొన్ని ప‌థ‌కాల‌ను కేంద్రం తీసుకువ‌చ్చింది. వాటిలో ప్ల‌స్‌లు ఉన్నాయి. మైన‌స్‌లు ఉన్నాయి.

అయితే.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు కేంద్రం పేరు చెప్ప‌కుండా వాటిని అమ‌లు చేసేవారు. దాదాపు ప్ల‌స్‌ల‌నే ఆయ‌న తీసుకునేవారు. మైన‌స్‌లైతే.. మాత్రం ప‌క్క‌న పెట్టేవారు. బ‌హుశ ఇదే బాబుకు-బీజేపీకి గ్యాప్ పెంచింద‌ని అంటారు. ఎందుకంటే.. చంద్ర‌బాబుకు కేంద్రానికి లొంగి ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న‌పై కేసులు కానీ.. కేంద్రం నుంచి వ్య‌క్తిగ‌త సాయం కానీ అవ‌స‌రం లేదు. దీంతో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా ఉన్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల విష‌యంలో ఎందుకో.. మౌన‌మే వ‌హించారు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం అన్నింటికి అడాప్ట్ చేసుకుంటున్నారు.

అయితే.. ఇక్క‌డ పొలిటిక‌ల్‌గా వ్యూహాన్ని ప్లే చేస్తున్నారు. త‌న‌కు, ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉంటే.. మొత్తం క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. తాజాగా జ‌గ‌న‌న్న చేయూత కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఇది వాస్త‌వానికి కేంద్రం నాలుగు మాసాల కింద‌టే ప్రారంభించింది. రోడ్డు ప‌క్క‌న వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకుల నుంచి ప‌ది వేలు సాయం అందించే ఈ కార్య‌క్ర‌మం కేంద్రమే తీసుకువ‌చ్చింది. కానీ, దీనిని జ‌గ‌న్ త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక‌, రాష్ట్రంలో స‌మ‌గ్ర స‌ర్వే చేప‌ట్టారు. అంటే.. ఎంత భూములు.. ఉన్నాయి. ఎన్ని ఆవాసాలు ఉన్నాయి.. అనే విష‌యాన్ని ప‌క్కా రికార్డు చేస్తారు.

ఇది కూడా కేంద్రం పెట్టిందే. అయితే.. జ‌గ‌న్ దీనిని కూడా త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక‌, రైతుల వ్య‌వ‌సాయ బోర్ల‌కు మీట‌ర్లు పెట్టేది కూడా కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌క‌మే.. అయితే. దీనిలో రైతుల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని తెలియ‌గానే.. వెంట‌నే దీనిని కేంద్ర బీజేపీ ఖాతాలో వేసేశారు. మాదేం లేదు.. కేంద్రం చెప్పింది చేస్తున్నాం.. ఏదైనా ఉంటే బీజేపీని అడ‌గండి అని మంత్రి బొత్స అనేశారు. ఇక‌, తాజాగా స్థిరాస్తి ప‌న్నులు పెంచాల‌ని నిర్ణ‌యించారు. ఇది కూడా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చేదే. దీంతో దీనిని కూడా తెలివిగా బొత్స కేంద్రం ఖాతాలోకి వేసేశారు. ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే. ఇలా.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న వాటికి త‌మ ట్యాగ్‌, వ్య‌తిరేకత వ‌స్తుంద‌ని భావిస్తే మాత్రం బీజేపీ ట్యాగ్ వేస్తుండ‌డంపై మేధావులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.