ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా: కవిత

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఆ పార్టీ అధినేత ఏకైక కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం తన భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలిగా ఆ సంస్థను తన చేతిలోకి తీసుకుని దాని ద్వారానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించే దిశగా ఆమె వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో లండన్ లోని తెలంగాణ ప్రవాసులతో కవిత సోమవారం ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పార్టీ ఎప్పుడు అన్న ప్రశ్నకు స్పందించిన కవిత…. ప్రజలు కోరుకుంటే పార్టీ తప్పనిసరిగా పెడతానని ఆమె నర్మగర్బ వ్యాఖ్యలు చేశారు.

అయినా ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉందన్న కవిత… అప్పటిదాకా ఏమేమీ మార్పులు వస్తాయో చూడాలి కదా అని వ్యాఖ్యానించారు. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు తన నుంచి పార్టీని కోరుకుంటారని అప్పుడు తాను పార్టీ పెట్టడం ఖాయం అని చెప్పారు. అయితే ఆ అవకాశం తనకు వచ్చి తీరుతుందని కూడా కవిత ఒకింత ధీమాగానే చెప్పారు. ప్రజల్లో మార్పులు తీసుకురావడంపై తన వరకు ఓ స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు పార్టీ పెట్టే విషయంలో ఇప్పటికిప్పుడు అడుగు ముందుకు వేయనని కూడా ఆమె చెప్పుకొచ్చారు. 

ఇక కవిత ఆ పార్టీలో చేరుతున్నారు, ఈ పార్టీలో చేరుతున్నారు అన్న వార్తలపై ఎదురైన ప్రశ్నలకు కూడా ఆమె విస్పష్టంగానే సమాధానం చెప్పారు. తన వెనుక ఏ జాతీయ రాజకీయ పార్టీ లేదని ఆమె అన్నారు. తాను ఏ జాతీయ పార్టీలోనూ చేరబోవడం లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓ మునిగిపోయే నావగా అభివర్ణించిన కవిత… అభివృ‌ద్ది పథంలో సాగుతున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిస్తోందని ఆమె ఆరోపించారు. బీజేపీ డీఎన్ఏ తన ఒంటికి సరిపడదని తెలిపారు. 

ఇక తాను రాజీనామా చేసిన బీఆర్ఎస్ లో తన ప్రస్థానం గురించి కూడా కవిత ఓపెన్ గానే సమాధానాలు ఇచ్చారు. 20 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడితే… తనకు అవమానాలు మాత్రమే దక్కాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోని కొందరు వ్యక్తుల్లో స్వార్థం పురుడుపోసుకుందని, ఫలితంగా కోట్లాది మంది ప్రజలు జీవితాలు ప్రభావితం అవుతాయన్న భావనతో అవమానాలను భరించానని తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తన ఓటమి మొదలుకొని బీఆర్ఎస్ ఓటమి దాకా ఎన్నో కుట్రలు జరిగాయని తెలిపారు. తనను వద్దనుకున్న పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేశానన్న కవిత… దానిని చైర్మన్ ఎందుకు ఆమోదించడం లేదో తనకు తెలియదని కవిత చెప్పారు.