కామ్రెడ్ నారాయణ. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) జాతీయ కార్యదర్శిగా ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు. అయితే.. తాజాగా ఈ పదవి నుంచి ఆయన తప్పుకొన్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తన పదవికి ఆయన రాజీనామా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ కీలక నాయకుడిగా వ్యవహరించిన నారాయణ.. అన్ని పార్టీల అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. తద్వారా.. అందరికీ ఆయన సుపరిచితుడు అయ్యారు. విషయం ఏదైనా.. ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతారు. ఎలాంటి మొహమాటం లేదు.
విద్యుత్ చార్జీల పెంపు విషయంలో చంద్రబాబును ఏకేసిన నారాయణ.. తర్వాత.. అమరావతి విషయంలోను.. అభివృద్ధి విషయంలోనూ.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. ప్రధానిగా మోడీని మెచ్చుకునే నారాయణ.. మత రాజకీయాలకు తెరదీస్తున్నారని.. లౌకిక అనే పదానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని కూడా అనేక సందర్భాల్లో ఏకేశారు. ఇక, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులపై ఒక యుద్ధమే చేశారు. అయితే.. అదేసమయంలో వలంటీర్ వ్యవస్థను, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, ఆర్బీకే కేంద్రాలను మెచ్చుకున్నారు. ఇలా.. తనదైన శైలిలో రాజకీయాలు చేసే నారాయణ తాజాగా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొన్నారు.
ఎందుకు?
కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారాయణ యుక్త వయసు నుంచే పోరాటాల బట్టారు. సీపీఐలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన హయాంలోనే ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య అనేక సార్లు సఖ్యత కోసం ప్రయత్నాలు జరిగాయి. అంతేకాదు.. ఆయన హయాంలోనే కమ్యూనిస్టులు మెజారిటీ సంఖ్యలో చట్టసభల్లో పాల్గొన్నారు. అయితే.. పార్టీ గతంలోనే తీసుకున్న నిర్ణయం మేరకు.. ఏ నాయకుడికైనా 75 ఏళ్లు నిండితే.. క్రియాశీలక పదవులకు రాజీనామాలు చేయాలి. ఈ క్రమంలోనే ఇటీవల 75 వసంతాలు పూర్తి చేసుకున్న నారాయణ తన పదవికి రాజీనామా చేశారు. ఇక, నుంచి ఆయన పార్టీకి సలహాదారుగా మాత్రమే కొనసాగుతారు.
ఆ ఒక్క మాటతో చేయి కడిగేసుకుని..
‘సీపీఐ నారాయణ’గా పేరొందిన నారాయణ రెండు తెలుగు రాష్ట్రాల మీడియాకు అత్యంత స్నేహితుడు. ఆయన వచ్చారంటే.. పరుగు పరుగున మీడియా అక్కడ వాలిపోతుంది. ఆయన ఏం మాట్లాడినా వార్తే. ఆయన ఏం చేసినా వార్తే. ఒక సందర్భంలో ఆయన ప్రైవేటు పార్టీకి వచ్చారు. ఆ సమయంలో అక్కడ చికెన్ వంటకాన్ని ఆయనకు వడ్డించారు. దీనిని ఆయన తీసుకున్నారు. ఈ సమయంలో మీడియా మిత్రుడు ఒకరు.. “సార్.. ఈ రోజు అక్టోబరు 2. గాంధీ జయంతి. మద్యం, మటన్, చికెన్పై నిషేధం ఉంది. మీరు ఎలా తీసుకున్నారు” అని అడిగాడు. దీంతో అవాక్కయిన నారాయణ.. తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. “ఔను.. కదా! తప్పు చేశానయ్యా.” అని అక్కడితో చేయి కడుక్కుని.. బయటకు వచ్చారు.
మిగిలిన మీడియా వారిని పిలిచి.. “ఈ రోజు అక్టోబరు 2. గాంధీ గారి జయంతి. రమేష్(మీడియా ప్రతినిధి) ఇప్పుడే చెప్పాడు. తప్పు ఎవరు చేసినా తప్పే. నాకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఈ రోజు నుంచి ఏడాది పాటు చికెన్ ముట్టను.” అని శపథం చేశారు. నిజంగా అలానే ఆయన ఏడాది పాటు చికెన్ జోలికి పోకుండా మాట నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ‘చికెన్ నారాయణ’ అనే పేరు కూడా వచ్చినా.. ఎక్కడా బాధపడలేదు. నిబద్ధతకు.. నారాయణ నిదర్శనం అని చెప్పేందుకు ఇదొక్కటి చాలు.
అనేక చమక్కలు!
ఇక, అక్కినేని నాగార్జున నిర్వహించే బిగ్ బాస్ను బ్రోతల్ హౌస్ అంటూ.. వ్యాఖ్యానించినా.. వైసీపీ నాయకురాలు.. రోజాను ‘జంబలకిడి పంబ’ అని సంబోధించినా.. చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అని విమర్శించినా.. నారాయణ వ్యాఖ్యలు హాట్ కేకులే!!. ఇప్పుడు ఆయన క్రియా శీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం.. పార్టీలో చర్చనీయాంశం అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates