ఏపీ సీఎం చంద్రబాబు.. పేదలకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. “దసరా కానుకగా.. వారికి నేను ప్రకటిస్తున్నాను..” అని పేర్కొన్న ఆయన.. త్వరలోనే ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదలకు అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న కృత నిశ్చయంతో ఉన్నామని చెప్పారు. తాజాగా శనివారం సాయంత్రం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. పేదలకు కూడు-గూడు-గుడ్డ ఇవ్వాలన్న సంకల్పంతోనే టీడీపీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరిం చారు. గతంలో పార్టీ అధినేత ఎన్టీఆర్.. పేదలను సెంట్రిక్గా చేసుకుని అనేక పథకాలు అమలు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే రూ.2కే బియ్యాన్ని అందించారని చెప్పారు.
పేదలకు సేవ చేయడం ఒక వరంగా పేర్కొన్న చంద్రబాబు.. వారికి అన్ని విధాలా తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని.. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. సొమ్ములు వారికి ఇచ్చామన్నా రు. అలాగే.. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, వచ్చే రెండేళ్లలో 450 క్యాంటన్లను పనిచేసేలా చేస్తామన్నారు. ఒక నిరంతర యజ్ఞం మాదిరిగా పేదల కోసం.. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. “పేదలను దృష్టిలో పెట్టుకుని 2014-19 మధ్య టిడ్కో ఇళ్లకు శ్రీకారం చుట్టాం. వేలాది మందికి ఇచ్చాం. కానీ, తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని అటకెక్కించి.. పేదల గూడును కూడా కూలదోసింది. మళ్లీ ఇప్పుడు దానిపై కార్యాచరణ చేపట్టాం.” అని చంద్రబాబు వివరించారు.
త్వరలోనే ఇప్పటికే కట్టి, సిద్ధం చేసిన టిడ్కో ఇళ్లను పేదలకు ఇస్తామన్నారు. దసరా కానుకగా.. పేదలకు ఇళ్లను ప్రకటించి.. వాటిని అందించే బాధ్యతను స్వయంగా తానే తీసుకుంటానని చంద్రబాబు వివరించారు. వచ్చే 2029 నాటికి పూర్తిగా అందరికీ ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈవిషయంలో వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. పేదల కోసమే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆలోచన చేస్తున్నారని చంద్రబాబు చెప్పడం గమనార్హం. ఆయన శాఖల్లోనూ అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని వివరించారు.
“గత ఐదేళ్లు కనుక టీడీపీ మరోసారి వచ్చి ఉంటే రాష్ట్రం పరిస్థితి వేరేగా ఉంది. కానీ, అలా జరగలేదు. ఒక్క ఛాన్స్ అంటూ.. గత పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు అదే పెద్ద మైనస్ అయింది. అయినా.. ఆర్థికంగా బలం పుంజుకునేందుకు అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం. ఇప్పటికే ఆ క్రతువు దాదాపు పూర్తి కావొచ్చు. ఇక, నుంచి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తాం. సంపద సృష్టిస్తామని ఎన్నికలకు ముందు చెప్పాం. ఇప్పుడు అది సాకారం అవుతోంది. పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖ, అమరావతి నగరాలు.. ఏపీకి కుడి భుజంగా మారనున్నాయి. పేదలే కాదు.. మధ్యతరగతి వర్గాలకు కూడా మేలు చేసేలా ప్రభుత్వ విధానాలు ఉండనున్నాయి.” అని చంద్రబాబు వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates