ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం నాటి శాసన మండలి సమావేశాల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వాదనను ప్రస్తావించారు. ఎమ్మెల్యేలకు నాణ్యమైన టీ, కాఫీ ఇస్తున్న సిబ్బంది… ఎమ్మెల్సీలకు మాత్రం నాసిరకం టీ, కాఫీ ఇస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణ విన్నంతనే సభలో ఉన్న మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్ లు సహా సభలోని సభ్యులంతా ఒకింత షాక్ కు గురయ్యారు.
ఎమ్మెల్యేలకు సరిసమానంగా ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్ మర్యాదలు దక్కడం లేదన్న అంశంపై శనివారం నాటి సభలో బొత్స ప్రస్తావించారు. ఈ సందర్భంగా బయట ఎక్కడో ఎందుకు… అసెంబ్లీ క్యాంటీన్ కు వెళితే… ఆ తేడా ఇక్కడే కనిపిస్తుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలకు చెందిన క్యాంటీన్ లో క్వాలిటీతో కూడిన టీ, కాఫీ సర్వ్ చేస్తున్న సిబ్బంది ఎమ్మెల్సీల క్యాంటీన్ లో మాత్రం నాసిరకం టీ, కాఫీీలు సరఫరా చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఒకింత గట్టిగానే ప్రస్తావించిన బొత్స… సభలో ఈ విషయాన్ని ప్రస్తావించడం సబబు కాకున్నా ప్రస్తావించాల్సి వస్తోందన్నారు.
బొత్స టీ, కాఫీ ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇవ్వబోగా.. ఆయనను వారించిన కేశవ్ తాను చూసుకుంటానంటూ ఒకింత సావధానంగానే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల క్యాంటీన్, ఎమ్మెల్సీల క్యాంటీన్ రెంటినీ ఒకే కాంట్రాక్టర్ కు ఇచ్చామని పయ్యావుల తెలిపారు. అసలు అసెంబ్లీలో టీ, కాఫీ, టిఫిన్, భోజనం మొత్తం అన్నీ సదరు కాంట్రాక్టరే నిర్వహిస్తారని చెప్పారు. ఈ లెక్కన తేడా వచ్చే సమస్యే లేదని మంత్రి తెలిపారు. అయినా సభ్యులు ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి తాను స్వయంగా పరిశీలించి.. ఏదైనా తేడా ఉంటే సరిచేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమయంలో మండలి చైర్మన్ గా వ్యవహరిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ మోషేన్ రాజు కూడా బొత్స వాదనకు మద్దతు పలికారు. సభ్యులు దాదాపుగా ఓ పది సార్లు నాసిరకంగా ఉన్న పానీయాలను తీసుకుని వచ్చారని, సభ్యులు చెప్పినట్టే ఆ పానీయాలు క్వాలిటీగా ఏమీ లేవని చెప్పారు. దీంతో తాను అసెంబ్లీ కార్యదర్శిని పిలిచి మరీ విషయం సరిదిద్దమని సూచించానన్నారు. మొత్తంగా ఎమ్మెల్సీలకు అటు ప్రొటో్కాల్ లో ఇటు టీ, కాఫీల నాణ్యతలోనూ అన్యాయం జరుగుతోందని బొత్స చెబితే…దానికి చైర్మన్ మోషేన్ రాజు వత్తాసు పలకడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates