ప్ర‌యోగాలు విక‌టించాయి.. ఇక, వ‌ద్దులే: క‌ళ్లు తెరిచిన జ‌గ‌న్ ..!

కొత్తగా వచ్చిన నాయకులకు వైసీపీలో అవకాశం కల్పించారు. మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా పదవులు ఇచ్చారు. ముఖ్యంగా నంద్యాల జిల్లాకు చెందిన జకియా ఖానంకు మండలిలో డిప్యూటీ చైర్మన్ గా కూడా జగన్ అవకాశం కల్పించారు. ఇక, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా కొత్తముఖాలే. కారణాలు ఏమైనా వీరందరికీ కూడా జగన్ మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. మంచి పదవులు కూడా ఇచ్చారు. సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు, సానుభూతి కోణంలో కావచ్చు. ఏది ఏమైనా ప్రజల్లో పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో కొంతమంది నాయకులకు జగన్ అవకాశం కల్పించారు.

ఈ క్రమంలో జగన్ చేసిన అతి పెద్ద పొరపాటు పార్టీ కోసం బలంగా వాయిస్ వినిపించిన అదేవిధంగా పార్టీలో ఆది నుంచి ఉన్న నాయకులను పక్కన పెట్టడమే. వాస్తవానికి ఏ పార్టీలో అయినా మూల స్తంభాలుగా కొంతమంది నాయకులు కార్యకర్తలు కూడా పనిచేస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కనీస గుర్తింపు లేకపోయినా కూడా జెండా మోసే నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. పదవులను ఆశించకుండా పనిచేసే వారు ఉన్నారు. పదవులు ఆశించిన వారు ఉన్నారు.

ఈ విషయాన్ని గుర్తించాల్సింది పార్టీల అధిష్టానాలు మాత్రమే. ఒకొక్కసారి కొంతమంది నాయకుల విషయంలో అన్యాయం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలానే వైసీపీలో మరింత ఎక్కువగా అన్యాయం జరిగిందన్నది కూడా వాస్తవం. పార్టీలో సుదీర్ఘకాలం నుంచి ఉన్న నాయకులను పక్కనపెట్టి కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం, కొత్తగా వచ్చిన వారికి ఎమ్మెల్సీలు ఇవ్వడం, అదేవిధంగా కీలక పదవులను అప్పగించడం వంటివి కూడా పార్టీలో గత ఐదేళ్లలో తీవ్ర చర్చనీయాంసంగా మారింది.

మరీ ముఖ్యంగా సామాజిక వర్గ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని జగన్ వేసిన అడుగులు.. రెడ్డి సామాజిక వర్గాన్ని మరింత బలహీనపరిచాయి. ఇది గత ఎన్నికల్లో పార్టీకి ఓటమిని, జగన్‌కు పరాభవాన్ని తెచ్చేందుకు కూడా కారణమైంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది నాయకులు ఉన్నప్పటికీ మరి కొంతమంది ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారు అధికారంలోకి పార్టీ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారు ఇప్పుడు పార్టీని వదిలేశారని చెప్పాలి.

ఉదాహరణకు ఆమంచి కృష్ణమోహన్, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ వీళ్ళందరూ కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జెండా కప్పుకున్నవారే. ఇప్పుడు వీరందరూ పార్టీని వదిలేసి చాన్నాళ్లు అయిపోయింది. ఇక మిగిలింది, జండాలు మోస్తోంది ఎవరు అంటే కచ్చితంగా పార్టీకి ఆది నుంచి అండగా ఉన్నవారు. ఆది నుంచి జండా మోస్తున్న వారనే చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు సమీకరణలు మార్చుకోవాల్సిన అవసరం పార్టీకి ఎంతైనా ఏర్పడింది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆది నుంచి జండా మోస్తున్న కార్యకర్తలను గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా నాయకులు చెబుతున్నారు. ఈ దిశగా అడుగులు వేయకుండా కొత్తగా వచ్చిన వారికి పదవులు అప్పగిస్తే మాత్రం ప్రమాదకరంమైన పరిస్థితిని ఎదుర్కొక తప్పదని చెబుతున్నారు. మరి జగన్ ఏం చేస్తారనేది చూడాలి.