ప‌వ‌న్‌-బీజేపీల పొత్తుకు బీట‌లు?

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు. ఎవ‌రికి అవ‌కాశం.. ఎవ‌రికి అవ‌స ‌రం వారు చూసుకునే పార్టీలు, నాయ‌కులు ఉన్న కాల‌మిది. దీంతో ఎవ‌రికి వారు త‌మ త‌మ ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. దీంతో రాజ‌కీయాల్లో పొత్తులు. క‌లిసి ముందుకు సాగ‌డాలు.. వంటివి గ‌తంలో మాదిరిగా ద‌శాబ్దాల పాటు కొన‌సాగే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సివ‌స్తోందంటే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పొత్తు పెట్టుకున్న బీజేపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య ఇప్పుడు విక‌టించే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

మేం విడిపోం! క‌లిసే ముందుకు సాగుతాం!! అని ఆ పార్టీ నేత‌లు పైకి చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా అటు గ్రేట‌ర్ విష‌యంలో బీజేపీ.. ఇటు తిరుపతి ఉప ఎన్నిక విష‌యంలో జ‌న‌సేన ఒక పార్టీపై మ‌రోపార్టీ కారాలు మిరియాలు నూరుతున్నాయి. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మ‌ధ్య బంధం నిలిచేది కాద‌నే విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తాను పోటీ నుంచి తప్పుకొని.. బీజేపీకి ప్ర‌చారం చేసిపెడ‌తాన‌ని.. ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

అయితే.. ఎన్నిక‌ల‌కు డేట్ ముంచుకువ‌స్తున్నా. ప‌వ‌న్ ఎక్క‌డా దీనిపై ఉలుకు ప‌లుకు లేకుండా ఉన్నా రు. దీంతో బీజేపీలో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. పైగా కేసీఆర్‌తో ప‌వ‌న్‌కు ఉన్న బంధం నేప‌థ్యంలో.. ప‌వ‌న్ వ‌చ్చినా.. కేసీఆర్‌ను టార్గెట్ చేసే ప‌రిస్థితి ఉండ‌ద‌నేలెక్క‌లు సైతం వేసుకుంటున్నారు. ఇక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకొని మీకు స‌హ‌క‌రించాం.. క‌నుక మాకు తిరుప‌తి ఉప ఎన్నిక‌ను వ‌దిలేయండ‌ని.. ప‌వ‌న్ డిమాండ్ చేస్తున్నారు.

కానీ, తిరుప‌తిలో జ‌న‌సేన‌కు బ‌లం లేద‌ని.. మాకే బ‌లం ఉంద‌ని.. ఎట్టిప‌రిస్థితిలోనూ వ‌దులుకునేది లేద‌ని బీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ రెండు ప‌రిణామాలు కూడా ఇరు పార్టీల్లోనూ స‌మ‌స్య‌గా మారాయి. దీంతో వీరిరువురి పొత్తు నిల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.