టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ.. ఆ పదవి కోసమేనా?

వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కొన్నాళ్ల కిందటే పార్టీకి రాజీనామా చేశారు. అదేసమయంలో ఆయన పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. అయితే అప్పటి నుంచి ఏ పార్టీలో చేరాలా అన్న ఆలోచన చేసిన ఆయన తాజాగా సైకిల్‌ను ఎంచుకున్నట్టుగా తెలిసింది. శుక్రవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని మర్రి అనుచరులు చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ వైఎస్ హయాం నుంచి కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత ముఖ్య నాయకుడిగా మారారు.

ఈ క్రమంలోనే 2019లో సీటును త్యాగం చేశారు. అప్పట్లో జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని కూడా ఇస్తానని బహిరంగ సభ సాక్షిగా హామీ ఇచ్చారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా ఆయనను పట్టించుకోలేదు. ఎట్టకేల‌కు ప్రభుత్వం పడిపోతున్న దశలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి కూడా పార్టీకి దూరంగా ఉంటున్న మర్రి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి రాజీనామా సమర్పించారు. కానీ పదవిని మాత్రం వదులుకోలేదు. ఈ వ్యవహారం వెనుక గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువ ఎంపీ ఉన్నారని సమాచారం.

వైసీపీని వదిలేసినా ఎమ్మెల్సీగా ఉన్న మర్రి ఏనాడూ సభకు రాలేదు. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబును కలిసిన ఆయన పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో శుక్రవారం ఆయన పార్టీ మార్పు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.

చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 2004లో విజయం దక్కించుకున్న మర్రి రాజశేఖర్ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. వివాదాలకు దూరంగా రాజకీయంగా ఆయన మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు ఆయనకు కలసి వస్తున్న పరిణామాలుగా చెబుతున్నారు.

అయితే ఆది నుంచి రాజకీయ వైరం ఉండడంతో చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మర్రి రాకను వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కూడా చంద్రబాబు చర్చించి వచ్చే ఎన్నికల్లో టికెట్ వ్యవహారం అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆధారపడుతుందని, ఇప్పుడే దానిపై చర్చ అవసరం లేదని తేల్చి చెప్పారు. పార్టీ బలోపేతం కావడం ముఖ్యమని స్పష్టం చేశారు. దీంతో పుల్లారావు వెనక్కి తగ్గారు.

ఫలితంగా మర్రి రాజశేఖర్‌కు మార్గం సుగమం అయిందని తెలిసింది.