జ‌గ‌న్‌కు సెగ పెంచేసిన ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రింత సెగ పెంచారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ మంట‌లు రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో తీవ్ర క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వ‌ర‌కు దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌సుడిగా.. జ‌గ‌న్ చెప్పుకొంటున్నారు. తానే నిజ‌మైన వార‌సుడిని అని ఆయన బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా.. త‌న పాల‌న‌లోనూ… పార్టీలోనూ.. వైఎస్ పేరును పెట్టుకున్నారు. ఆయ‌న పేరిట ప‌లు ప‌థ‌కాల‌ను కూడా తీసుకువ‌చ్చారు. అయితే.. తాజాగా దీనికి తూట్లుపొడుస్తూ.. ష‌ర్మిల‌.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

త‌న కుమారుడు రాజారెడ్డే.. అస‌లు సిస‌లు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌సుడ‌ని.. ష‌ర్మిల తేల్చేశారు. వైఎస్ స్వ‌యంగా త‌న కుమారుడికి ‘రాజా రెడ్డి’ పేరు పెట్టార‌ని, ఇది త‌న తాత పేర‌ని.. కాబ‌ట్టి.. రాజ‌శేఖ‌ర‌రెడ్డికి వార‌సులు ఎవ‌రైనా ఉంటే.. అది ఒక్క రాజారెడ్డి మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ఇదేస‌మ‌యంలో ఆమె వైసీపీ నాయ‌కుల‌ను, పార్టీని కూడా తీవ్ర‌స్థాయిలో దూషించారు. “వైసీపీ సైతాన్ సైన్యం. అది సైతాన్ పార్టీ” అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సో.. దీనిని బ‌ట్టి.. ష‌ర్మిల ఫుల్లు క్లారిటీతోనే ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇటీవ‌ల క‌ర్నూలులో ప‌ర్య‌టించిన‌ప్పుడు తొలిసారి త‌న కుమారుడు రాజారెడ్డిని తీసుకుని ష‌ర్మిల వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంలోనే ఆమె.. ‘అవ‌స‌ర‌మైన‌ప్పుడు.. రాజా రాజ‌కీయాల్లోకి వ‌స్తాడు’ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విష‌యాన్ని ఆమె అక్క‌డితోనే వ‌దిలేసినా.. వైసీపీ నాయ‌కులు రాజ‌కీయం చేసుకున్నారు. రాజా వెనుక టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు ఉన్నార‌ని, బాబుకు ప‌వ‌న్‌తో ప‌ని అయిపోయింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాజాను వాడుకుంటాడ‌ని.. తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక ప్ర‌చారం చేశారు. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టుగానే ష‌ర్మిల చేస్తున్నార‌ని కూడా పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలోనే ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఎవ‌రో చెబితే తాము రాజ‌కీయాలు చేయడం లేద‌ని, త‌మ తండ్రి వార‌స‌త్వంగానే రాజ‌కీయాలు చేస్తున్నామ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. మోడీకి ద‌త్త‌పుత్ర‌డ‌ని.. ఎవ‌రు చెబితే ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎన్డీయే అభ్య‌ర్థికి ఓటు వేశార‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌కు రాజ‌కీయాల్లో ఉండే అర్హ‌త లేద‌న్న ష‌ర్మిల‌.. రాజా రెడ్డిని మ‌రింత ఎక్కువ‌గా తాము ప్రోజెక్టు చేయాల్సిన‌ అవ‌స‌రం లేకుండా.. వైసీపీనే ప్రొజెక్టు చేస్తోంద‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీలో భారీ సెగ రాజుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.