వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న మొండి వైఖరిపై రాజకీయ వర్గాల్లో విమర్శలు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో జగన్ కు ఇంటా బయట కూడా సెగ తగులుతోంది. సభకు వెళ్లాల్సిందేనని.. సీమకు చెందిన నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే భారీ డ్యామేజీ జరిగిందని.. దీని నుంచి బయట పడేందుకు సభను వినియోగించుకుందామని.. చెబుతున్నారు. కానీ.. జగన్ మాత్రం, ప్రధాన ప్రతిపక్షం హోదా ఇస్తే తప్ప! అని పట్టుబడుతున్నారు.
దీంతో.. జగన్ వ్యవహారంపై మరోసారి రాజకీయంగా చర్చ తెరమీదికి వచ్చింది. ముఖ్యంగా..ఈ విషయం లో సీఎం, సభా నాయకుడు చంద్రబాబు కీలక దృష్టి పెట్టారు. జగన్ వైపు నుంచి వచ్చే విమర్శలతో ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా తనకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందని గుర్తించారు. “ఉద్దేశ పూర్వంగానే మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లండి” అని జగన్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. దీంతో సోషల్ మీడియాలో సర్కారును టార్గెట్ చేస్తున్నారు.
వైసీపీకి చెందిన సీనియర్ల నుంచి జూనియర్ల వరకు కూడా తమకు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వడం లేదని, రాజకీయంగా తమను బద్నాం చేస్తున్నారని ప్రచారం అందుకున్నారు. దీనిని గుర్తించిన చంద్రబాబు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. పాత వీడియోలను బయటకు తీసి.. ప్రచారంలోకి తీసుకురావాలని సోషల్ మీడియాను ఆయన ఆదేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ హయాంలో సభలో ఏం జరిగిందో ప్రజలకు గుర్తు చేయాలని.. బాబు సూచించినట్టు తెలిపాయి.
అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. నిండు సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు టీడీపీ ప్రచారం చేయనుంది. సీఎంగా ఉన్న జగన్.. సభలో మాట్లాడుతూ.. “టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మావైపు వచ్చేందుకు రెడీగా ఉన్నారు.ఆ నలుగురిని నేను లాగేసుకుంటే.. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు” అని సభలో ఉన్న చంద్రబాబును చూస్తూ.. చిటికెలు వేసి హెచ్చరించారు. ఇప్పుడు ఆ వీడియోనే టీడీపీకి ఆయుధంగా మారనుంది. వైసీపీ ఆనాడు కూడా 10 శాతం మంది ఎమ్మెల్యేలు లేకపోతే.. ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని చెప్పిందన్న విషయాన్ని ఇప్పుడు ప్రజల మధ్యకు తీసుకువెళ్లనున్నారు. ఇది జగన్కు భారీ డ్యామేజీ చేస్తుందని పార్టీ నాయకులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates