వైసీపీ నేతలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు తన సొంత ఖర్చుతో చీరలు పంపిస్తానని, వాటిని కట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో 16 వేల బస్సులు ఉంటే కేవలం 4 వేల బస్సుల్లోనే ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోందని వైసీపీ నాయకులు ఆరోపించారు. అదేసమయంలో మహిళలకు బస్సులు సరిపోక సీట్లు లభించక ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు.
గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు ఆర్టీసీ ఉచిత బస్సులపై కామెంట్లు చేస్తున్నారు. మహిళలకు ఉచితం లేదని, కొందరికి మాత్రమే వర్తింప చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లను తాజాగా ప్రస్తావించిన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి ప్రాంతంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను ఉచిత బస్సు ప్రయాణంపై ఆరాతీశారు. వారు అంతా బాగానే ఉందని సమాధానం చెప్పారు. ఈ పథకాన్ని ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. అనంతరం మంత్రి వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావించారు.
రాష్ట్రంలో ప్రజలు బాగానే ఉన్నారని, కానీ అధికారం పోయిందన్న బాధ వైసీపీని వీడడం లేదని అన్నారు. అందుకే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు.
ఒకవేళ ప్రభుత్వం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదని వైసీపీ నాయకులు భావిస్తే,
“నేను చీరలు పంపిస్తా. నేనే కొంటా. ఎంత మంది ఉన్నారో లెక్క చెప్పండి. అన్ని చీరలు నేనే పంపిస్తా. వాటిని కట్టుకుని బస్సులు ఎక్కండి. అప్పుడు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారో లేదో తెలుస్తుంది” అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates