జ‌గ‌న్ పాలిటిక్స్‌.. అయితే ఏంటి..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాలిటిక్స్ భిన్నంగా ఉన్నాయి. ఆయ‌న ఏం జ‌రిగినా భిన్నంగా ఆలోచ‌న చేస్తారు. ఏ విష‌యాన్ని కూడా ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకోరు. ఇది మంచిది కాదు. కొంప‌తీసి రాసేస్తారా ఏంటి? రాయ‌మాకండి! అని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తాజాగా మీడియా ముందు చేసిన వ్యాఖ్య‌లు. నిజ‌మే! జ‌గ‌న్ పాలిటిక్స్ అంతే అని మిగిలిన నాయ‌కుల మాట కూడా. ఆది నుంచి ఏం జ‌రిగినా ఆయ‌న మౌనంగా ఉంటారు.

కానీ నిజం తెలిసేలోగా అబ‌ద్ధం ప్ర‌పంచాన్ని చుట్టేస్తుంది. అది రాజ‌కీయాల్లో అయితే మ‌రింత ఎక్కువ‌గా జ‌రుగుతుంది. ఈ విష‌యంపైనే ఇప్పుడు వైసీపీలో ల‌డాయి జ‌రుగుతోంది. జ‌గ‌న్ వైఖ‌రి న‌చ్చ‌ని నాయ‌కులు పెరుగుతున్నారు. వీరిలో సీనియ‌ర్ల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసేందుకూ సిద్ధంగా ఉన్నారన్న చ‌ర్చ సాగుతోంది. ఈ విష‌యాన్నే మీడియా మిత్రులు బొత్స ముందు ప్ర‌స్తావించిన‌ప్పుడు, “మా నాయ‌కుడు అంతే!” అని సెల‌విచ్చారు.

నిజానికి రాజ‌కీయాల్లో స‌రైన స‌మ‌యం అంటూ ఏదీ ఉండ‌దు. ప్ర‌త్య‌ర్థులు ఎప్పుడు నోళ్లు విప్పితే అప్పుడే స‌మాధానం చెప్ప‌డం స‌రైన స‌మ‌యం. కానీ జ‌గ‌న్ మాత్రం ముహూర్తాలు చూసుకుంటున్నారన్నది నాయ‌కులు చెబుతున్న మాట. దీంతో కొంద‌రు తమకే యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకుని పార్టీ కోసం ప‌నిచేస్తున్నారు. మ‌రికొంద‌రు “మనకెందుకులే” అని మౌనంగా ఉన్నారు. ఇంకొంద‌రు రెండు ప‌క్క‌ల రాజ‌కీయాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నారు.

ఇది వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత పెరిగితే వైసీపీకి న‌ష్టం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీ త‌ప్ప ప్ర‌త్యామ్నాయం లేద‌ని, ప్రజ‌లు త‌మ‌కే అనుకూలంగా ఉంటార‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అందుకే ఆయ‌న మౌనంగా ఉంటున్నారు. దీనిని సీమాంధ్ర‌కు చెందిన చాలామంది నాయ‌కులు వ్య‌తిరేకిస్తున్నారు. ఈ ప‌రిణామాలే పార్టీలో చిచ్చుకు కార‌ణంగా మారుతున్నాయి. జ‌గ‌న్ మౌనం, ఆయ‌న ఉదాసీన‌త‌ను చాలా మంది త‌ట్టుకోలేక‌పోతున్నారు. బ‌ల‌మైన గ‌ళం కోసం ఎదురు చూస్తున్నారు.

చిత్రం ఏంటంటే.. బొత్స త్వ‌ర‌లోనే రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ‌కు ఇదే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.