కమ్యూనిస్టులు అంటేనే కులాలకు, మతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. కుల జాడ్యాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వారు పోరాటాలు చేసిన సంస్కృతి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇవన్నీ కాగితాలకే, గతానికే పరిమితం అయ్యే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)లో తాజాగా కుల చిచ్చు రేగింది. ముఖ్యంగా కీలక పదవి విషయంలో కామ్రెడ్స్ రెండుగా చీలిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీనికి కారణం ఏమిటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది.
ఇదీ విషయం..
ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ (బీసీ) స్థానంలో మరో నాయకుడిని ఎంపిక చేయాల్సి ఉంది. రామకృష్ణ ఇప్పటివరకు ఆరేళ్లుగా ఈ పదవిలో ఉన్నారు. వాస్తవానికి కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం ఎవరికైనా రెండు సార్లకు మించి కీలక పదవులు ఇవ్వరాదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను పేర్కొంటూ ఇప్పటివరకు మూడు సార్లుగా రామకృష్ణను రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేస్తూనే ఉన్నారు. ఇక మూడు సార్ల తర్వాత కూడా ఆయన ఆ పదవిలో ఉండకూడదనేది పెద్ద నాయకులు చెబుతున్న మాట.
దీంతో తాజాగా ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి సీపీఐ మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శిని ఎంపిక చేయాలని కామ్రెడ్స్ భావించారు. ఈ క్రమంలో ముందుగానే సీనియర్ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావును (ఓసీ – కమ్మ) ఈ పదవికి ఎంపిక చేద్దామని తీర్మానం చేయాలని నిర్ణయించారు. కానీ ఇదే కుల వివాదానికి దారితీసింది. కమ్మ సామాజిక వర్గానికే పదవులు ఎందుకు కట్టబెడుతున్నారు, రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కూడా సుదీర్ఘకాలంగా కమ్యూనిస్టులుగానే ఉన్నారంటూ సీమ ప్రాంతానికి చెందిన కామ్రెడ్స్ ఘర్షణకు దిగారు.
ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన గుజ్జల ఈశ్వరరావుకు రాష్ట్ర కార్యదర్శి పదవిని ఇవ్వాలని మెజారిటీ కామ్రెడ్స్ నిరసన కూడా వ్యక్తం చేశారు. దీంతో ముప్పాళ్లను సమర్థించే వర్గం, ఇటు ఈశ్వరరావును సమర్థించే వర్గం రెండుగా చీలిపోయి కుల ప్రాతిపదికన కామెంట్లు చేసుకున్నారు. దీంతో సీనియర్ నేతలు నారాయణ సహా ఇతర నేతలు ఈ ఎంపిక కాదు, ఎన్నికల ద్వారా కార్యదర్శిని నిర్ణయించుకుందామని ప్రతిపాదించారు.
ఇలా చూసినా ముప్పాళ్ల కంటే ఈశ్వరయ్యకు ఎక్కువ మంది మద్దతు ఉండడంతో అసలు ఇప్పుడు వదిలేయాలనిపించింది. కాగా ఈ పరిణామాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం విస్మయం వ్యక్తం చేసింది. ఎక్కడా లేని విధంగా కుల చిచ్చు చోటు చేసుకోవడం, పదవి కోసం పోరుకు దిగడాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఢిల్లీకి పిలిచింది. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates