స్వామి సలహా: ఫస్ట్ టైమ్ జగన్ గణపతి పూజ

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తొలిసారి వినాయక చవితి పూజలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏటా గణపతి ఉత్సవాలు నిర్వహించినా, దానికి ఆయన కడుదూరంగా ఉంటారు. గత ఏడాది కూడా వైవీ సుబ్బారెడ్డి సహా కొందరు పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొనగా, జగన్ మాత్రం వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉన్నారు.

కానీ, ఈసారి మాత్రం ఆయనే నేరుగా ఈ పూజల్లో పాల్గొనడం, స్వామివారి కథ వినడం, చివరన ప్రసాదం కూడా తినడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఏం జరిగింది?

వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరసిద్ధ వినాయకుని ఆశీర్వచనాలు పొంది ప్రసాదం స్వీకరించారు. ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు లభించేలా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు ఈ సందర్బంగా జగన్ పేర్కొన్నారు. ప్రజలందరికీ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.

స్వామి సలహాయేనా?

మరోవైపు, జగన్ ఇలా వినాయక చవితి వేడుకల్లో పాల్గొని పూజలు చేయడం వెనుక ఆయన మనసుకు నచ్చిన విశాఖకు చెందిన పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఉండి ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పార్టీ పరిస్థితితోపాటు వ్యక్తిగతంగా కూడా జగన్ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారని అంటున్నారు.

వాస్తవానికి ఆది నుంచి క్రిస్టియానిటీలో ఉన్న జగన్ ఎప్పుడూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తాము చూడలేదని సీనియర్లు చెబుతున్నారు. కేవలం ఓ సందేశం ఇచ్చి ఊరుకుంటారని, కానీ ఈ దఫా మాత్రం ఆయన నేరుగా పూజల్లో పాల్గొన్నారని తెలిపారు. కాగా జగన్ సతీమణి భారతి మాత్రం ఈ పూజలకు దూరంగా ఉన్నారు.