ఇక మోడీ తప్పించుకోలేరు.. బాంబు పేల్చిన ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాంబు లాంటి సంచలనం విషయాన్ని వెల్లడించారు. ఇక దీని నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తప్పించుకునే అవకాశం లేదని, ఆయన వివరణ ఇవ్వక తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

జమ్ము కశ్మీర్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఏప్రిల్‌లో ఉగ్రవాదులు చొరబడి పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 21 మంది (ఒకరు నేపాలీ) మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్ మేలో ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది.

ఇది ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారి తీసింది. సుమారు 4 రోజుల పాటు పాక్-భారత్‌ల మధ్య దాడులు జరిగాయి. అయితే అనూహ్యంగా మే 10న సాయంత్రం భారత్ కాల్పుల విరమణను ప్రకటించింది. దీనికే ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలనం ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పులు ఆపింది తానేనని చెప్పారు. అణు ఆయుధ దేశాలైన భారత్-పాక్‌లను తాను తీవ్రంగా హెచ్చరించానని, వాణిజ్యాన్ని నిలిపివేస్తానని చెప్పానని, దీంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అన్నారు.

అప్పటి నుంచి కూడా ట్రంప్ పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఈ వ్యాఖ్యలపై నేరుగా స్పందించలేదు. దీనిపై విపక్ష కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు అసలు ఏం జరిగిందో చెప్పాలని, ట్రంప్ ప్రమేయం ఎందుకు వచ్చిందని నిలదీశాయి. అయినా కూడా మోడీ ఎక్కడా నేరుగా ట్రంప్ గురించి వ్యాఖ్యానించలేదు. తామే దాడులు ఆపామని, పాక్ కాళ్లబేరానికి వచ్చిందని, అందుకే దయ చూపించామని అన్నారు. కానీ ట్రంప్ మాత్రం తన వ్యాఖ్యలతో ఇరుకున పెడుతూనే ఉన్నారు.

తాజాగా మరో సంచలనం విషయాన్ని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడానని ఆయన బాంబు పేల్చారు. ఇప్పటి వరకు ఆయన కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు చేసిన ప్రకటన మరోసారి ప్రకంపనలు సృష్టించింది. నేరుగా ట్రంప్ ప్రధాని మోడీని టార్గెట్ చేయడం, ఆయనే ఫోన్ చేసి ఆపరేషన్ సిందూర్‌పై చర్చించానని చెప్పడం సంచలనంగా మారింది.

దాంతో ఇప్పుడు మోడీ దీనిపై పెదవి విప్పితీరాలని రాహుల్ గాంధీ సహా విపక్ష నాయకులు డిమాండ్లు చేస్తున్నారు.