వైసీపీ ఎఫెక్ట్… జైలుకు ఐపీఎస్ సంజయ్

2019లో ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ… తాను చెప్పినట్టుగా వినే అధికారులను అందలమెక్కించి… ఆ పనులు పూర్తి అయ్యాక వారు కోరిన శాఖలకు బదిలీ చేసి అందిన కాడికి దోచుకోండి అంటూ వదిలేశారని చాలా ఆరోపణలే ఉన్నాయి. అందులో భాగంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూటమి సర్కారు వచ్చాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టై విడుదల కాగా… తాజాగా మంగళవారం మరో డీజీ స్థాయి అధికారి ఎన్. సంజయ్ అరెస్టు అయ్యారు. సంజయ్ ను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

వైసీపీ అధికారంలో ఉండగా… నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. నాడు సీఐడీ చీఫ్ గా సంజయ్ వ్యవహరించారు. స్కిల్ కేసును టేకప్ చేసిన సీఐడీ.. సరైన ఆధారాలు లేకుండానే బాబును అరెస్టు చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ తడబాటే చెప్పకనే చెప్పింది. మొత్తానికి బాబు రిలీజ్ కావడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ తర్వాత వైసీపీ పెద్దలు చెప్పినట్లు విని లెక్కలేనన్ని తప్పులు చేసిన వారిపై కూటమి దృష్టి సారించగా… దొరికిన అధికారుల్లో సంజయ్ కూడా ఉన్నారు.

సీఐడీ చీఫ్ గా బాబును అరెస్టు చేసిన తర్వాత సంజయ్ ఫైర్ సేఫ్టీ విభాగం డీజీగా బదిలీ అయ్యారు. ఆ శాఖలో పలు పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సంజయ్ దాదాపుగా రూ.1 కోటికి పైగా నిధులను తన జేబులో వేసుకున్నారు. ఈ విషయం బయటపడటంతో కూటమి సర్కారు ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనను అరెస్టు చేస్తారన్న భయపడ్డ సంజయ్.. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అక్కడ కుదరకపోవడంతో నేరుగా ఆయన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా సంజయ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

ఫలితంగా ఇక తన పప్పులు ఉడకవని భావించిన సంజయ్ మంగళవారం నేరుగా విజయవాడలోని అవినీతి నిరోధ శాఖ (ఏసీబీ) కోర్టులో లొంగిపోయారు. ఆ వెంటనే కోర్టు ఆదేశంలో ఏసీబీ అధికారులు సంజయ్ పై కేసు నమోదు చేసి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ అధికారుల వాదనలతో ఏకీభవించిన కోర్టు… సంజయ్ కు వచ్చే నెల 8 వరకు రిమాండ్ కు తరలించింది. ఆ వెంటనే సంజయ్ ను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇటీవలే అదే జైలులో డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ విచారణ ఖైదీగా ఉండి విడుదల కాగా… కొన్నాళ్లకే అదే స్థాయి కలిగిన సంజయ్ అదే జైలుకు విచారణ ఖైదీగానే రావడం గమనార్హం.