అసలే ఇది పండుగల సీజన్. ముందు వినాయక చవితి. ఆ తర్వాత దసరా. ఇలా యావత్తు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగే ఈ పండుగల కోలాహలం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి నేపథ్యంలో గణేశ్ ఉత్సవ సమితులు, వినాయక మండపాల నిర్వాహకులు ఏపీ ప్రభుత్వానికి ఓ విన్నపం చేశారు. అది కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ద్వారా వారు ఈ వినతిని ప్రభుత్వానికి పంపారు. ఈ విషయాన్ని కాస్తంత సీరియస్ గా తీసుకున్న లోకేశ్… గణేశ్ ఉత్సవ సమితిలతో పాటు దసరా సందర్భంగా ఏర్పాటు అయ్యే దుర్గా మాత మండపాల నిర్వాహకులకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. గణేశ్ మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులు… వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని లోకేశ్ కోరారు. ఈ వినతిని లోకేశ్ నేరుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ల ముందు పెట్టారు. సీఎం, విద్యుత్ శాఖ మంత్రి దీనిపై చర్చించి లోకేశ్ చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు. అనంతరం గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు వారు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే… వినాయక చవితి ముగిసిన కొన్నాళ్లకే దసరా వేడుకలు కూడా ఉన్నాయి కదా. ఇదే విషయం సీఎం, లోకేశ్, గొట్టిపాటి చర్చల్లో ప్రస్తావనకు రాగా… వినాయక మండపాలకు మాత్రమే ఎందుకు? దసరా సందర్భంగా ఎక్కడికక్కడ వెలిసే దుర్గామాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ను అందజేద్దామని వారు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు వేడుకల మండపాలకు ఉచిత విద్యుత్ కోసం ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పినా… శుభకార్యాల మండపాలకు ఆమాత్రం ఖర్చు పెట్టడంలో తప్పు లేదని సీఎం అభిప్రాయపడినట్టు సమాచారం. మొత్తంగా గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు అడిగితే… దుర్గామాత భక్తులకూ లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates