జ‌గ‌న్ పాలిటిక్స్‌: మిథున్ రెడ్డిని ప‌రామ‌ర్శించాలా.. వద్దా.. ?

జైల్లో ఉన్న నాయకులను పరామర్శించడం ఇటీవల వైసిపి అధినేత జ‌గ‌న్‌కు కామన్ గా మారిన విషయం తెలిసిందే. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఓ కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో ఉన్నప్పుడు జగన్ వెళ్లి పరామర్శించారు. ఆయన పై అక్రమంగా కేసులు బనాయించార‌ని, మరియమ్మ అనే ఎస్సీ మహిళ రెండు వర్గాల ఘర్షణ కారణంగా జరిగిన దాడిలో చనిపోయారని జగన్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్లి పరామర్శించారు.

కాకాని తప్పులేదని, కూటమి ప్రభుత్వం ఉద్దేశ‌పూర్వకంగా తమ నాయకులను అణిచివేస్తోందని చెప్పుకొచ్చారు. టిడిపి కార్యకర్తను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయి.. విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభ‌నేని వంశీ(ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నారు)ని కూడా జగన్ వెళ్లి పరామర్శించారు. అప్పట్లోనూ కూటమి ప్రభుత్వం పైన, పోలీసులపైన తీవ్రస్థాయిలో విమర్శలు గుర్తించారు. ఇలా తమ నాయకులను జైల్లో పెట్టిన ప్రతిసారి జగన్ వెళ్లడం, ప‌రామ‌ర్శించ‌డం కామన్‌గా మారింది.

ఇక ఇప్పుడు తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కూడా పోలీసులు జైల్లో పెట్టారు. వైసిపి హయాంలో జరిగిన మద్యం అక్రమాలు, నగదు లావాదేవీల వ్యవహారంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్నది ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి దాదాపు రెండు వారాలు గడిచిపోయింది. మరోవైపు పార్లమెంటు సమావేశాలు కూడా ముగిసిపోయాయి.

అయితే వచ్చే నెల 9వ తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్ డి ఏ కూటమికి వైసీపీ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఓటు కీలకమని భావిస్తున్నారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డికి బెయిల్ తీసుకొచ్చే విషయంపై ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు జైల్లో ఉన్న మిథున్ రెడ్డి తనను పరామర్శించేందుకు వస్తున్న‌ వారిని జగన్ గురించే ఎక్కువగా అడుగుతున్నట్టు తెలుస్తోంది. జగనన్న ఏమన్నాడు.. జగనన్న ఎప్పుడు వస్తున్నాడు.. అని ఆయన పదేపదే అడుగుతున్నట్టు పరామర్శించి వచ్చినవారు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్న మాట.

కానీ ఇప్పటివరకు జగన్ ఆ దిశగా ఆలోచన చేయలేదని, మిధునరెడ్డిని పరామర్శించేందుకు వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చ కూడా పెట్టలేదని సమాచారం. ఇప్పటివరకు పరామర్శించిన వారిని గమనిస్తే కేవలం వ్యక్తిగతంగా వారిపై ఉన్న కేసులకు సంబంధించి జైలుకు వెళ్లిన వారిని మాత్రమే జగన్ పరామర్శిస్తూ వచ్చారు. కానీ, లిక్కర్ కుంభకోణం విషయానికి వస్తే దానిలో జగన్ పాత్ర కూడా ఉందన్నది సిట్ అధికారులు ఇటీవల దాఖలు చేసిన రెండు చార్జిషీట్లలో కూడా పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తాను జైలుకు వెళ్లి పరామర్శిస్తే అది కేసును మరింత మలుపు తిప్పే అవకాశం ఉందని, మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని కూడా జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మిధున్‌ రెడ్డిని పరామర్శించే విషయంపై ఇంతవరకు దృష్టి పెట్టలేదని సమాచారం. మరి ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.