సభా సమరం ముగిసింది.. గెలుపెవరిది?

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. గత నెల జూలై 21న ప్రారంభమైన సమావేశాలు గురువారం (ఆగస్టు 21)తో నిరవధికంగా వాయిదా పడ్డాయి. సాధారణంగా.. సమావేశాలు అనే మాట ఎప్పుడో తెరమరుగైంది. సమరమే తప్ప.. సమావేశాలు, సుహృద్భావ చర్చలకు దేశంలో అసెంబ్లీలే కాదు.. దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన పార్లమెంటు కూడా ఎప్పుడో తెరదించేశాయి. ఇప్పుడు ఏ సమావేశం అయినా.. సమరాన్నే తలపిస్తున్నాయి. అధికార పక్షంపై ప్రతిపక్షం, ప్రత్యర్థి పక్షంపై అధికార పక్షం పైచేయి సాధించడం ఇప్పుడు సభల విజయానికి గీటురాయిగా మారింది.

ఈ క్రమంలో తాజాగా ముగిసిన సభాసమరంలో గెలుపు ఎవరిది? పైచేయి ఎవరిది? అనే ప్రశ్నలు తెర మీదికి వచ్చాయి. రెండు విషయాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పైచేయి సాధించింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా జరిపిన ఆపరేషన్ సిందూర్ దాడులపై చర్చకు పట్టుబట్టి.. రెండు రోజుల పాటు ప్రభుత్వం దీనిపై చర్చించేలా, సమాధానం చెప్పేలా చేసింది.

ఇక, బీహార్‌లో 65 లక్షల ఓట్ల చోరీ వ్యవహారాన్ని దేశంలో చర్చకు వచ్చేలా రెండు సభలనూ పదేపదే స్తంభింపజేయడంలోనూ సక్సెస్ అయింది. (వాస్తవానికి ఇది వ్యతిరేకమే అయినా.. ఈ విషయంలో ప్రత్యర్థిదే పైచేయి అయింది). ఇతర విషయాలేవీ ప్రతిపక్షం పెద్దగా పట్టించుకోలేదు. కేవలం రెండే అంశాలపై నిరవధికంగా ఉద్యమించింది.

ఇక, అధికార పక్షానికి వస్తే.. అన్నీ విజయాలే నమోదయ్యాయి.

ఆపరేషన్ సిందూర్‌ పై చర్చ చేపట్టినా.. కాంగ్రెస్ సహా విపక్షాలు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అమెరికా అధ్య‌క్షుడి పాత్ర ఎంత? ఆయన ఎందుకు క్లెయిమ్ చేసుకుంటున్నారన్న విషయంలో మోడీ ఎదురు దాడి చేసి.. నెహ్రూ కాలాన్ని తిరగదోడారే తప్ప ప్రత్యర్థి పక్షానికి సమాధానం చెప్పలేదు.

బీహార్ ఓట్ల చోరీ అంశంపై నిరంతరం.. పదేపదే ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించినా.. ఉభయ సభల్నీ నిలిపివేసేలా ఆందోళనకు దిగినా.. పన్నెత్తు మాట కూడా అధికార పక్షం నుంచి వినిపించలేదు.

తాను చేపట్టాల్సిన బిల్లులనూ నిర్విఘ్నంగా కేంద్రం ప్రవేశపెట్టింది. ఎంత అలజడి ఉన్నా.. చివరికి హోం మంత్రి అమిత్ షాపై చిత్తుకాయితాలు చించిపోయినా.. రాజ్యాంగ సవరణ ద్వారా మూడు చట్టాలను తీసుకువచ్చే బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ మొత్తం పార్లమెంటు సమావేశాల్లో రెండే విషయాలు కీలకంగా మారాయి.

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు. దీని ద్వారా ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులకు చెక్ పెట్టారు.

యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాకు అభినందనలు తెలుపుతూ.. రోజు రోజంతా చర్చ చేపట్టారు.