ఏపీ రాజధాని అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు పండగ చేసుకునే వాతావరణం ఇది. ఇప్పటి వరకు ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించినా, వాటిని వారికి అప్పగించే విషయంలో తాత్సారం జరుగుతూనే ఉంది. అదేవిధంగా వారికి కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. తాజాగా ఈ గ్రామాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మొత్తం 29 గ్రామాల్లో రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లను సాధ్యమైనంత వేగంగా వారికి అప్పగించాలని నిర్ణయించింది. అంతేకాదు, ఆయా గ్రామాల్లో రహదారులు, కాలువలు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం సహా ప్రత్యేకంగా రెండు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) ప్రతిపాదించిన 904 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ఓకే చెప్పింది.
ఈ నిధులతో పైన పేర్కొన్న పనులను వచ్చే ఆరు నెలల్లో చేపట్టనున్నారు. మార్చి 31 నాటికి వాటిని పూర్తి చేసి, అనంతరం రైతులకు ప్లాట్లను అప్పగించనున్నారు. నిజానికి 2018లోనే రైతులకు భూములు కేటాయించినప్పటికీ వాటిని వారికి అప్పగించలేదు. ఇటీవల ఈ వ్యవహారం జఠిలంగా మారింది. పైగా రైతుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అనుకూల మీడియాలోనూ వ్యతిరేక కథనాలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు మరింత భూసమీકરણ సాకారం కావాలంటే ప్రస్తుతం ఉన్న రైతులను సంతృప్తి పరచాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే తాజా మంత్రివర్గ సమావేశంలో 904 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు ఓకే చెప్పారు. తద్వారా వచ్చే ఆరు నెలల్లో వడివడిగా పనులు ముందుకు సాగి, రాజధాని గ్రామాల్లో అభివృద్ధి సౌరభాలు నింపనున్నారు. ఇది అమరావతికి సాధారణ ప్రజలను కూడా ఆకర్షించేలా చేస్తుందన్న భావన మంత్రివర్గంలో వెల్లడైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates