రష్యా, ఇండియా బాండింగ్ ఎంత బలంగా ఉందంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై అదనపు సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్యంలో కలకలం రేపింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌస్‌ స్పష్టంచేయడం మరింత వివాదాస్పదమైంది. అయితే దీనిపై రష్యా ఘాటుగా స్పందించింది. భారతదేశానికి వ్యతిరేకంగా సుంకాలు విధించడం అన్యాయమని, ఏకపక్ష ఒత్తిడి సరైంది కాదని రష్యా ఉపమిషన్‌ చీఫ్‌ రోమన్‌ బబుష్కిన్‌ తెలిపారు.

మాస్కో అధికారులు భారత్‌కు ధైర్యం చెబుతూ, అమెరికా మార్కెట్‌లో ఇబ్బందులు ఎదురైతే రష్యా మార్కెట్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ప్రకటించారు. భారతీయ వస్తువులు, ముఖ్యంగా ఎగుమతులు రష్యాకు వస్తే ఇరుదేశాల ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. భారత్‌ నుంచి రష్యాకు ఎగుమతులు ఏడేళ్లలో ఏడు రెట్లు పెరిగాయని ఆయన వివరించారు.

ఈ వ్యాఖ్యలు ట్రంప్‌ నిర్ణయం తర్వాత రావడం గమనార్హం. ఆగస్టు 27 నుంచి 25 శాతం అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పన్నులు పెంచిన నేపథ్యంలో టెక్స్టైల్స్‌, లెదర్‌, సముద్ర ఉత్పత్తులపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్‌ అయితే ఈ చర్యను అన్యాయం అని ఖండించింది. ప్రధాని మోదీ కూడా స్పష్టం చేస్తూ, ఎలాంటి ఒత్తిడికీ తలొగ్గమని అన్నారు.

రష్యా మాత్రం భారత్‌తో ఉన్న ఎనర్జీ భాగస్వామ్యంపై నమ్మకంగా ఉంది. భారత్‌ పెరుగుతున్న చమురు అవసరాలను తాము తీర్చగలమని మాస్కో అధికారులు పేర్కొన్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే ఈ స్థాయిలో ఒత్తిడి తేవని కూడా వారు విమర్శించారు. “పాశ్చాత్య దేశాలు నీయోకాలనియల్‌ విధానాలు అనుసరిస్తున్నాయి. తమకే లాభమయ్యేలా నడుస్తున్నాయి. కానీ రష్యా, భారత్‌ సంబంధాలు నిజమైన వ్యూహాత్మక భాగస్వామ్యం” అని బబుష్కిన్‌ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య ఇటీవల జరిగిన ఫోన్‌ సంభాషణను ప్రస్తావిస్తూ, ఇరుదేశాల బంధం ఎంత బలంగా ఉందో రష్యా గుర్తుచేసింది. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నా భారత్‌ రష్యా భాగస్వామ్యం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రష్యా కీలక పాత్రను ఎవరూ విస్మరించలేరని, సుంకాలు విధించిన దేశాలకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. మొత్తానికి, ట్రంప్‌ చర్యలు భారత్‌ అమెరికా సంబంధాలపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, రష్యా మాత్రం ఈ పరిస్థితిని భారత్‌ వైపు మరింత చేరువ కావడానికి అవకాశంగా మలుచుకుంటోంది. రాబోయే రోజుల్లో రష్యా భారత్‌ ఆర్థిక బంధం కొత్త దిశలో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది.