ఎన్డీఏ అదిరే వ్యూహం.. ‘వైస్ ప్రసిడెంట్’ అభ్యర్థి గా తమిళియన్

త్వరలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో దక్షిణాదిలోని కీలక రాష్ట్రం తమిళనాడు కూడా ఉంది. తమిళనాడు ఇప్పటిదాకా అడుగు కూడా పెట్టలేకపోతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ..ఈ దఫా ఓ అదిరేటి వ్యూహంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా ఇటీవలే ఖాళీ అయిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్తిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రాధాకృష్ణన్… ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. గతంలో మన తెలుగు రాష్ట్రం తెలంగాణకు కూడా ఆయన కొంతకాలం పాటు గవర్నర్ గా వ్యవహరించారు. జార్ఖండ్ గవర్నర్ గానూ ఆయన పనిచేశారు. వెరసి రాజ్యాంగబద్ధ విషయాలపై మంచి పట్టున్న నేతగా సీపీ రాధాకృష్ణన్ కు మంచి పేరుంది. అధికార పక్షం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాధాకృష్ణన్.. ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం ఖాయమేనని చెప్పక తప్పదు. విపక్షం ఇండియా కూటమి ఎన్ని ఎత్తులు వేసినా… ఆ కూటమి విజయం సాధించే ఛాన్సే లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

తమిళనాడు రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు చాలాకాలంగా ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాగైనా తమిళనాడు రాజకీయాలపై పట్టు సాధించే దిశగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమేర ఫలితాలు వస్తున్నా… ఎదురు దెబ్బలే అదికంగా తగులుతున్నాయి. అయినా కూడా మోదీ, షాలు తమిళనాడు పాలిటిక్స్ పై ఎంతమాత్రం దృష్టి మరల్చడం లేదు. వచ్చే ఏడాది ఆరంభంలో తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం ద్వారా ఓ మోస్తరు ప్రయోజనం పొందవచ్చన్నది మోదీ, షాల భావనగా తెలుస్తోంది.