కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ ఏపీ రాజకీయాలపై సునిశిత విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబుకు, ప్రతిపక్షంలో ఉన్న జగన్కు కూడా ప్రజల కంటే ప్రధాని మోడీనే ఎక్కువనని విమర్శించారు. దీంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఓట్ చోరీ అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు వస్తే ఏపీలో మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉన్నారని, కేంద్రం కనుసన్నల్లో బాబు, జగన్ పార్టీలు నడుస్తున్నాయన్నారు. బాబు పార్టీ + జగన్ పార్టీ = బీజేపీ అని కామెంట్ చేశారు.
క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలు కూడా మోడీకి మద్దతు ఇస్తున్నాయని, కీలకమైన మైన్స్ మినరల్స్ బిల్లుకు భుజం భుజం రాసుకుని కొనియాడుతున్నారని విమర్శించారు.
పార్లమెంటులో 239 మంది ప్రతిపక్ష ఎంపీలు ఓట్ చోరీపై చర్చకు పట్టుబడుతుంటే జనసేన పార్టీకి చెందిన ఓ ఎంపీ మాత్రం మైన్స్ మినరల్స్ బిల్లుపై సుదీర్ఘ ఉపన్యాసం చేశారని మాణిక్కం ఠాకూర్ విమర్శించారు. అదేసమయంలో ప్రజాస్వామ్యం లూటీ అవుతుంటే మాత్రం మౌనంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో ఉందని, కానీ వైసీపీ మాత్రం అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమికి కూడా తటస్థంగా ఉందని అన్నారు. అంతేకాదు ఎన్నికల్లో తాము మోసపోయామంటూ వైసీపీ ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఓట్ చోరీ అంశంపై మాత్రం పెదవి విప్పడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్ చేస్తోందన్నారు.
గత ఏడాది ఇదే అంశంపై సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో వైసీపీ నేత జగన్ భేటీ కూడా అయ్యారని ఠాకూర్ గుర్తు చేశారు. ఢిల్లీలో ఉద్యమాలు కూడా చేశారన్నారు. కానీ ఇటీవలి పాస్ అయిన మైన్స్ మినరల్స్ బిల్లుకు మాత్రం వైసీపీ మద్దతు ఇచ్చిందన్నారు. అంతేకాదు వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్రం తెచ్చిన మైన్స్ మినరల్స్ బిల్లును ఆకాశానికి ఎత్తేస్తూ కొనియాడారని గుర్తు చేశారు.
ఒకవైపు ఓట్ చోరీ అంశంపై చర్చకు పట్టుబడుతుంటే వీటిని పట్టించుకోని మోడీ సర్కారు కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశ పెడుతోందని, వీటిని టీడీపీ, వైసీపీ ఎంపీలు మద్దతుగా నిలిచి పాసయ్యేలా చేస్తున్నారని విమర్శించారు.
బాబు, జగన్ పార్టీలు పరస్పరం భుజం భుజం రాసుకుంటూ మోడీకి మద్దతు ఇస్తున్నాయని ఠాకూర్ అన్నారు. ఆంధ్రాలో ప్రజాస్వామ్యం దాడికి గురవుతుంటే బాబు, జగన్లు మాత్రం ప్రజల కంటే ఎక్కువగా మోడీకే భజన చేస్తున్నారని అన్నారు. ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ మోడీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పక్షాన తాము ఒకవైపు వనరులు, మరోవైపు ప్రజల ఓటు హక్కు కోసం పోరాడుతున్నట్టు ఠాకూర్ వెల్లడించారు. తాజా బిల్లు దేశానికి ప్రమాదకరమని అన్నారు. ఈ బిల్లు కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పోటెత్తి, సంక్లిష్ట ఖనిజాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates