కడప జిల్లా కేంద్రం స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి సతీమణి రెడ్డప్పగారి మాధవి రెడ్డి వ్యవహారం స్వాతంత్య్ర దినోత్సవాన వివాదాస్పదంగా మారింది. అంతకుముందు కూడా ఇదే తరహా వివాదాలు రేగినా… అవన్నీ మాధవి రెడ్డి స్టామినాను, పోరాట పటిమను చాటాయి. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కడపలో జరిగిన అధికార వేడుకలో వేదికపై తనకు కుర్చీ ఏధంటూ ఆమె ఏకంగా జాయింట్ కలెక్టర్ గా ఉన్న ఓ యువ మహిళా ఐఏఎస్ పై చిందులు తొక్కిన వైనం మాత్రం ఆమెను వివాదంలోకి నెట్టేసిందనే చెప్పక తప్పదు.
సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే వేదికపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ లతో కలిసి జిల్లాకు చెందిన మంత్రి గానీ, ఇంచార్జీ మంత్రి గానీ కూర్చుంటారు. ఒకవేళ జిల్లా మంత్రితో పాటు ఇంచార్జీ మంత్రి… ఇద్దరూ వస్తే కలెక్టర్, ఎస్పీ జాయింట్ కలెక్టర్ లతో కలిసి మొత్తం ఐదుగురు వేదిక మీద కూర్చుంటారు. అయితే జిల్లా కేంద్రానికి చెందిన ఎమ్మెల్యే అయినా, ఆ వేడుకకు హాజరయ్యే జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు అయినా వీవీఐపీల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలలో ముందు వరుసలో ఆసీనులవుతారు. వీరితో పాటు జిల్లా స్థాయి అధికారులు, అధికార పార్టీకి చెందిన జిల్లా స్థాయి నేతలు, స్వాతంత్య్ర సమర యోధులు ఆ గ్యాలరీలలో కూర్చుంటారు.
ప్రొటోకాల్ ప్రకారమే… కడపలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేదికపై జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ జాయింట్ కలెక్టర్ లు ఆసీనులయ్యారు. వేడుకకు భర్తతో కలిసి హాజరైన మాధవి రెడ్డి తనకు వేదికపై మంత్రి పక్కన సీటు వేయకపోవడాన్ని గమనించి… వీవీఐపీ గ్యాలరీ బయట నిలబడ్డారు. ఈ విషయాన్ని గమనించిన జాయింట్ కలెక్టర్ అదితీ సింగ్… ఎమ్మెల్యే వద్దకు వచ్చి వీవీఐపీ గ్యాలరీలో కూర్చోండి అంటూ సూచించారు. అంతే ఒక్కసారిగా భగ్గుమన్న మాధవి రెడ్డి… నాకెందుకు వేదిక మీద కుర్చీ వేయలేదంటూ జేసీపై నిప్పులు చెరిగారు. జేసీ ఏదో తన రాజకీయ ప్రత్యర్థి అయినట్టుగా ఆమె వైపు గుర్రుగా చూస్తూ అపర కాళిక మాదిరే కనిపించారు.
మాధవి రెడ్డి ఆగ్రహానికి బిత్తరపోయిన జేసీ కామ్ గా వెనుదిరిగారు. పరిస్థితి గమనించిన సిబ్బంది అప్పటికప్పుడు వేదిక మీద కలెక్టర్ పక్కన మరో కుర్చీని వేశారు. ఆ తర్వాత వేదిక మీద మంత్రి పక్కన ఆసీనులైన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్వయంగా లేచి వచ్చి ఆమెను వేదిక మీదకు ఆహ్వానించారు. అయితే అందుకు నిరాకరించిన మాధవి ‘థ్యాంక్యూ సార్’ అంటూ కోపంగా అన్నారు. అయితే గ్యాలరీలో అయినా కూర్చోండి అంటూ ఆయన సూచించగా… అందుకూ ఆమె నిరాకరించారు. ఆ తర్వాత అటు వేదిక ఎక్కకుండా, ఇటు గ్యాలరీలో కూర్చోకుండా తనతో పాటు తన భర్తనూ అరగంట పాటు అక్కడే నిలబెట్టేసుకున్న మాధవి రెడ్డి… ఆ తర్వాత చికాకుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates